
నిర్వాసితులకు స్వాంతన!
ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది
తొలి విడతలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి..
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వ కొలువులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దామరచర్ల మండల వీర్లపాలెం గ్రామ పరిధిలో చేపట్టిన యాదాద్రి ఽథర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఎట్టకేలకు ఉద్యోగాలు లభించాయి. గతంలో 112 మందికి ఉద్యోగాలను కల్పించిన ప్రభుత్వం శుక్రవారం మరో 325 మందికి ఉద్యోగాలను ఇచ్చింది. పవర్ ప్లాంట్ నిర్మాణ సమయంలో తమ భూములు, ఇళ్లు ఇచ్చి త్యాగం చేసిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ఎలాంటి అవాంతరాలు లేకుండా వేగంగా కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇందులో భాగమైన రెండు యూనిట్లను జాతికి అంకితం చేశారు. అయితే ఉద్యోగ కల్పన విషయం మాత్రం ఆలస్యమైంది. విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి పలుమార్లు పవర్ ప్లాంట్ పనులను సమీక్షించారు. ఆ సమయంలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారి విషయంలో మానవీయ కోణంలో వ్యవహరిస్తామని, గత ప్రభుత్వ హామీ అయినా తాము అమలు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన 112 మందికి జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అటెండర్లు, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఇస్తూ నియామక పత్రాలు అందజేశారు.
2017లోనే అర్హుల జాబితా..
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి 2015 జూన్ 8వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత భూసేకరణ పనులను పూర్తిచేశారు. 2017 అక్టోబర్లో ప్లాంట్ నిర్మాణ పనులను బీహెచ్ఈఎల్ చేపట్టింది. అయితే ప్లాంట్ నిర్మాణం కారణంగా ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితుల్లో ప్లాంట్లో ఉద్యోగాల కల్పనకు అర్హులైన వారిని అప్పట్లోనే ప్రభుత్వం గుర్తించింది. వారికి జాబ్ కార్డులను (ఉద్యోగ హామీ పత్రాలను) అందజేసింది.
ఫ 325 మందికి ఉద్యోగాలు
ఫ హైదరాబాద్లో నియామకపత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి
ఫ గతంలో 112 మందికి ఉద్యోగాల కల్పన
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో మాకున్న ఐదెకరాల భూమిని కోల్పోయాం. భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని అప్పట్లో జాబ్కార్డు అందజేశారు. శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. నాకు ప్లాంట్లోనే జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది.
– మండలోజు వినోద్కుమార్
పవర్ ప్లాంట్ పనులు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో ఇళ్లు, భూములు రెండింటిని కోల్పోయిన వీర్లపాలెం శివారు గిరిజనతండాలైన మోదుగులకుంట, కపూర్తండాలో 173 కుటుంబాలకు సంబంధించి అర్హుల జాబితాను రూపొందించారు. అందులో దాదాపు నలభై కుటుంబాల వారు తమ కుటుంబాల్లో ఉద్యోగాలు చేసే వ్యక్తులు లేనందున పరిహారం తీసుకున్నారు. మిగిలిన 133 కుటుంబాల వారు ఉండగా, అందులో 112 మందికి గత ఏప్రిల్లో ఉద్యోగాలు ఇచ్చారు. మరోవైపు పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు మాత్రమే కోల్పోయిన వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం (కొత్తపల్లి), తిమ్మాపురం గ్రామాల్లోని కుటుంబాలకు కూడా గత ప్రభుత్వం జాబ్కార్డులను ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఆయా కుటుంబాల కల నెరవేరింది.

నిర్వాసితులకు స్వాంతన!