
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి : ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం రాత్రి వరకు ఎగువ నుంచి మూసీ రిజర్వాయర్కు 6,835 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ప్రాజెక్టు ఏడు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 5,949 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా.. నీటిమట్టాన్ని 642.50 అడుగుల(3.79 టీఎంసీలు) వద్ద నిలకడగా ఉంచి ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 117 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని పేర్కొన్నారు.