మంత్రి జూపల్లి స్పందించాలి: రాఘవాచారి
● పీఆర్ఎల్ఐ నుంచి డిండికి నీరు
తరలించొద్దు..
● ఈ లిఫ్ట్ను ఒప్పుకొనేది లేదు.. మలి దశ తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో పోరాటం
● ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి
● జేఏసీ ఆధ్వర్యంలో ఉల్పర
నుంచి గొట్టిముక్కల వరకు
రిజర్వాయర్ల సందర్శన
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేస్తే.. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలమూరు రైతుల పట్ల వివక్ష చూపుతోంది. నల్లగొండ లీడర్లు చెప్పిన మాటలు విని ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం.. పాలమూరు నీటిని తరలించే కుట్రను ఇక సహించేది లేదు.. మా నీళ్లు మాకే కావాలి. ఈ మేరకు తెలంగాణ మలిదశ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతాం.’ అని ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి స్పష్టం చేశారు. యూఎంపీపీఎస్ జేఏసీ ప్రతినిధులు శనివారం మీడియాతో కలిసి డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైన ఉల్పర నుంచి గొట్టిముక్కల రిజర్వాయర్ వరకు జరుగుతున్న పనులను సందర్శించారు. అనంతరం చారకొండ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేందర్రెడ్డి మాట్లాడారు.జూరాల ప్రాజెక్ట్ నుంచి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు నీటిని తీసుకొని ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. శ్రీశైలం సోర్స్ ఆధారంగా కేసీఆర్ డిజైన్ మార్పు చేయడంతోనే సమస్య ఉత్పన్నమైందన్నారు. తొమ్మిదన్నరేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అంతేకాదు ఈ జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా.. డిండి ప్రాజెక్ట్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టడం అన్యాయమని.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి నష్టం వాటిల్లే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదన్నారు. సొంత జిల్లాకు చెందిన సీఎం రేవంత్రెడ్డి దీనిపై స్పందించాలన్నారు.
ఏపీలోని రాయలసీమలో చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణంతో పాలమూరుకు ఎంత అన్యాయం జరిగిందో.. నల్లగొండ జిల్లా కోసం చేపడుతున్న డిండి లిఫ్ట్ వల్ల కూడా జిల్లాకు అంతే అన్యాయం జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగు నీటి రంగంలో అన్యాయం చేశారని 2023 ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ను ఓడించి.. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. కానీ ఈ ఎమ్మెల్యేలు డిండిపై, పాలమూరు రైతాంగానికి కృష్ణా జలాలను అందించే విషయంలో పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో డిండికి నీటి తరలింపుపై అడ్డుకున్నామని వివరించారు. అప్పటి నాయకుడు, ఇప్పటి మంత్రి జూపల్లి, కాంగ్రెస్ నేతలు డిండిని వ్యతిరేకిస్తూ లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారే నల్లగొండ లీడర్ల చేతిలో దాసోహమయ్యారని.. మీరు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని.. ఈ బలం ఉన్నా ఇక్కడి రైతుల పక్షాన ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి ఇప్పటికై నా డిండి ప్రాజెక్ట్పై ఆయన వైఖరిని తెలియజేయాలన్నారు.


