వైభవంగా ఊరేగింపు
అచ్చంపేట: రాఖీ పండుగంటే సాధారణంగా అక్కాచెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి వేడుకగా చేసుకుంటారు. అయితే అచ్చంపేటలో పద్మశాలీలు మాత్రం వినూత్నంగా జరుపుకొంటారు. రాఖీ పండుగను నూలు పుట్టిన పండుగగా నిర్వహిస్తారు. ఇది 400 ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. పురాణాల్లో నూలు గురించి ఉంది. ఈ రోజు నూలు పుట్టిందని, నూలుతో తయారు చేసిన కంకణం కట్టుకొని చేపట్టే ప్రతి కార్యంలో సకల శుభాలు కలుగుతాయని పద్మశాలీల నమ్మకం. మార్కెట్లో ఎన్ని రకాల రాఖీలు వచ్చినా పద్మశాలీలు మాత్రం పత్తి నుంచి తయారు చేసిన నూలు కంకణాన్ని చేతికి కట్టుకోవడం ఆనవాయితీ.
46వ నూలు పూర్ణిమ సందర్భంగా గురువారం సాయంత్రం అచ్చంపేటలోని శ్రీరాంనగర్కాలనీకి చెందిన కోటకిశోర్ ఇంటి వద్ద ప్రత్యేక పూజల అనంతరం శివపార్వతులను అశ్వవాహనంపై విశేష అలంకరణతో పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగించారు. మహిళలు కోలాటాలు, డప్పులు, మంగళవాయిద్యాలు, హారతులు, అడుగుల భజనలతో భక్త మార్కండేయ శివాలయం వరకు ఊరేగింపు కొనసాగింది. అనంతరం మార్కండేయ ఆలయంలో అఖండ భజనలు నిర్వహించారు.
నూలు పూర్ణిమను సంప్రదాయబద్ధంగా, శుభసూచికగా భావించి జరుపుకొంటాం. ఎంతో నిష్టగా ఉండి నూలుతో కంకణం, జంధ్యం తయారు చేసి.. ధరిస్తాం. ఈ సంప్రదాయం భవిష్యత్ తరాలు కొనసాగించేలా చైతన్యం చేస్తున్నాం. అనాదిగా పద్మశాలీలు నూలు పుట్టిన దినాన్ని రాఖీ పౌర్ణమి నాడు జరుపుకోవడం ఆనవాయితీ. అచ్చంపేటలో 46 ఏళ్లుగా సామూహికంగా చేపడుతున్నాం.
– కిశోర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు, అచ్చంపేట


