కందనూలు: ఎస్సీల అభివృద్ధికి కేటాయించిన నిధులను వారి కోసమే ఖర్చు చేయాలని ఎంపీ మల్లురవి అన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్పై సమీక్ష సమావేశానికి ఎంపీ హాజరై మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కేవలం లెక్కల్లో కాకుండా.. వాటి ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. ఎస్సీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ కుటుంబాలకు అవసరమైన ఆరోగ్యం, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను గుర్తించి, అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించాలని చెప్పారు. ప్రతి శాఖకు మంజూరైన నిధులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నిధుల వినియోగానికి ముందుగానే కార్యాచరణ రూపొందించుకొని, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను సకాలంలో ప్రారంభించాలని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన నిధులను సకాలంలో, నిబంధనల మేరకు వినియోగించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


