పెంట్లవెల్లి: ‘సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దు.. వారిని లంచాలు అడుగుతూ కావాలని కాలయాపన చేస్తే సహించేది లేదు.. ఒక్కో దరఖాస్తుకు.. ఒక్కో రేటు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్లు.. కార్యాలయం మొత్తం అవినీతిమయంగా మారిందని స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత ఆర్డీఓదే’ అని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించి.. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రెవెన్యూ దరఖాస్తులపై ఆరా తీశారు. ముఖ్యంగా ఏయే గ్రామం నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్నింటిని పరిష్కరించారు.. ఇంకా పెండింగ్లో ఎన్ని ఉన్నాయి.. వాటికి సంబంధించి రికార్డులు చూపించాలని ఆదేశించారు. అలాగే చాలాకాలంగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లిన ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్లు గమనించిన మంత్రి.. ఆర్డీఓ బన్సీలాల్ను సైతం తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకుని పెండింగ్ పైళ్లపై ఆరా తీయగా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆర్డీఓ, తహసీల్దార్ భాస్కర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. మీరు కాలయాపన చేయడం ఏమిటని మండిపడ్డారు. కచ్చితంగా పెండింగ్లో ఉన్న పైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు.
లంచాలు అడుగుతూ కాలయాపన చేస్తే కఠిన చర్యలు
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆర్డీఓ, తహసీల్దార్ల పనితీరుపై ఆగ్రహం
టెంటు వేసుకుని కూర్చుంటా..
శనివారం కార్యాలయం దగ్గర ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టెంటు వేసుకుని కూర్చుంటా.. మండల ప్రజలు ఎవరికి ఏ సమస్యలు ఉన్నా దరఖాస్తు రూపంలో రాసుకుని రేపు నాకు ఇవ్వండి.. అలాగే గతంలో పనుల కోసం ఏ అధికారికి ఎంత డబ్బులు ఇచ్చారో చెప్పండి.. ఎవరికై నా మొహమాటం టే దరఖాస్తు రూపంలో పూర్తి సమాచారంతో ఇవ్వాలని మంత్రి ప్రజలకు సూచించారు. సోమవారం నుంచి తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల దగ్గర ప్రత్యేకంగా ఒక అబ్బాయిని పెట్టి.. ఏ దరఖాస్తులు వస్తున్నాయో పూర్తిగా చదివి తమ ఆఫీసుకు పంపించాలని స్థానిక నాయకులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు రామన్గౌడ్, గోవింద్గౌడ్, గోపినాయక్, నర్సింహయాదవ్, భాస్కర్గౌడ్, ఆసిఫ్, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.


