నాగర్కర్నూల్: ఏటా వ్యవసాయాధికారులు పంటల సాగు విస్తీర్ణం వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపిస్తారు. అయితే ఈ లెక్కల్లో పూర్తిస్థాయి కచ్చితత్వం ఉండవు. కొంత సమాచారం సేకరించి అంచనాలు వేసి ఆ గ్రామంలో ఈ పంట ఎన్ని ఎకరాలు.. మరో గ్రామంలో ఎన్ని ఎకరాలు అని నోటి లెక్కలు వేసి.. మండల, జిల్లావ్యాప్తంగా విస్తీర్ణం నిర్ణయిస్తారు. ఈ లెక్కల ఆధారంగా ఎరువుల కేటాయింపు, పంటల దిగుబడి కొనుగోళ్లు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి వస్తుండటంతో..
క్షేత్రస్థాయిలో పరిస్థితులు తారుమారవుతాయి. అయితే ఇకపై కాకి లెక్కలకు పుల్స్టాప్ పెట్టాలని భావించిన కేంద్ర ప్రభుత్వం డిజిటల్ యాప్ రూపొందించింది. ఈ యాప్ ద్వారా పూర్తిస్థాయిలో పంటల సాగు విస్తీర్ణం కచ్చితత్వంగా ఉంటుంది. వలంటీర్ సహాయంతో డిజిటల్ క్రాప్ సర్వే చేయనుంది. ఇక పంటల సాగు వివరాలు, ఎకరాలు, సర్వే నంబరుతో సహా, రైతుల పేర్లు వెలుగులోకి రావడంతో ఆ లెక్కలతోనే సాగు చేసిన ఎకరాలకే రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా ఇవ్వనుందని సమాచారం.
డిజిటల్ క్రాప్ సర్వే..
కేంద్ర ప్రభుత్వం చిన్న గ్రామం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో, ఏ రైతు ఎంత సాగు చేశారో కచ్చితమైన లెక్కలు ఉండాలనే నిర్ణయంతో డిజిటల్ క్రాప్ సర్వే కొత్త యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా ప్రతి పంట విస్తీర్ణంతోపాటు ఏ స్థలం ఎక్కడ, ఏ రైతు పొలంలో వేశారో తేలనుంది. గ్రామం నుంచి మండలంలో జిల్లాలో, రాష్ట్రంలో ఎన్ని ఎకరాల్లో ఏ పంట సాగు వేశారో ఎంత మంది రైతులో సంఖ్య తేలుతుంది. అన్ని రకాల పంటల వివరాలు ఎకరాల్లో కచ్చితమైన సమాచారం ఉంటుంది. దీంతో రైతుల వద్ద ఉన్న పంట ఎంత దిగుబడి వస్తుందో అంచనాకు రావచ్చు. మార్కెట్ కొనుగోలు, విక్రయాలకు కూడా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వివరాలు అన్నింటిని రైతులు పేర్లతో సహా ధాన్యం కొనుగోలు చేసే ఏజెన్సీలకు అప్పగిస్తారు.
సాగు విస్తీర్ణంపై కచ్చితమైన లెక్కల కోసం డిజిటల్ యాప్
వలంటీర్తో ప్రతి సర్వేలో పంటల ఫొటో చిత్రీకరణ
ఇక నుంచి పంటల సాగు విస్తీర్ణంపై కాకి లెక్కలకు చెల్లు
పంటల దిగుబడి కొనుగోలుపై తేలనున్న లెక్క
సీజన్ వారీగా సాగు చేసిన విస్తీర్ణంకే రైతు భరోసా


