● 11 యూనిట్లతో 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి
● శ్రీశైలానికి తగ్గిన వరద.. 167.87 టీఎంసీల నిల్వ
గద్వాల/ఆత్మకూర్/అచ్చంపేట: ఎగువ ప్రాంతాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శుక్రవారం 70,495 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరగా.. వివిధ కాలువలు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.06 మీటర్లకు చేరింది. నీటి నిల్వ 8.73 టీఎంసీలుగా నమోదైంది. విద్యుదుత్పత్తికి 42,401 క్యూసెక్కులు, నెట్టెంపాడు, భీమా–1, భీమా–2, కోయిల్సాగర్ తదితర ప్రాజెక్టులకు కలిపి మొత్తం ప్రాజెక్టు నుంచి 76,803 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేపట్టారు. ఎగువ కేంద్రంలో ఆరు యూనిట్లతో 234 మెగావాట్లు, దిగువ కేంద్రంలో ఐదు యూనిట్లతో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 139.917 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. కాగా.. శ్రీశైలం జలాశయంలో 167.8764 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిమట్టం 875.90 అడుగులకు చేరింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 20.159 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా కాల్వకు 3,050 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 8 వేల క్యూసెక్కులు, ఎంజీకేఎల్కు 2,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


