కందనూలు: రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాసం, అటవీ సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్లు, రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో వీసీ ద్వారా సమగ్ర సమగ్ర సమీక్ష నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ జిల్లాలో కొనసాగుతున్న పాలమూరు– రంగారెడ్డి, కేఎల్ఐ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట ఎత్తిపోతల పథకం తదిత సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ భూ సేకరణపై సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. భూ సేకరణకు సంబంధించిన ప్రతి కేసును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, భూ యజమానులు, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. అవసరమైన చోట రెవెన్యూ, నీటి పారుదల, అటవీ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని చెప్పారు. అలాగే నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పునరుద్ధరణ చర్యలను సమాంతరంగా చేపట్టాలన్నారు. ఆయా అంశాలపై పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.


