తెలకపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుదామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల్నర్సింహ అన్నారు. ఈ నెల 6 నుంచి 14 వరకు చేపడుతున్న సీపీఐ ప్రజాపోరు పాదయాత్రలో భాగంగా సోమవారం మండలంలోని చిన్నముద్దునూరు, రాంరెడ్డిపల్లి, తాళ్లపల్లి, నడిగడ్డ, రామగిరి, గౌరారం, పర్వతాపూర్, రాకొండ, తెలకపల్లిలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పూర్తిగా విఫలం చెందారన్నారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన మాటలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. గతంలో కార్మికులు 8 గంటలు పనిచేస్తే నేడు 12 గంటలకు పెంచి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా నష్టపరిచే విధంగా 3 చట్టాలను తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. దళిత, గిరిజన వర్గాలకు పెద్దపీట వేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలపైన వివక్ష చూపడం బీసీ ప్రధాని అని చెప్పుకొనే నరేంద్రమోదీకి తగదన్నారు. ఈ విషయాలపై ప్రజలను చైతన్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కేశవులుగౌడ్, బాలమురళికృష్ణ, శివశంకర్, రవీందర్, ఆంజనేయులు, బుగ్గస్వామి, విష్ణు, నరేందర్రెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.


