పెద్దకొత్తపల్లి: నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్న పాలకులపై యువత తిరగబడే రోజులు వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పార్టీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం పెద్దకొత్తపల్లి మండలంలోని మారెడుమాన్దిన్నె, సాతాపూర్, నారాయణపల్లి, గంట్రావుపల్లి, మహాసముద్రం, చెన్నపురావుపల్లి, కొండ్రావుపల్లి గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా బాల్నర్సింహతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీకి అధికారం కట్టబెడితే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పారన్నారు. దేశ యువతకు పూర్తిగా అన్యాయం చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు. జిల్లాలో పేరుకుపోయిన ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు తన్నీరు నర్సింహ, తుమ్మల శివుడు, లక్ష్మీపతి, కుర్మయ్య, కిరణ్కుమార్ పాల్గొన్నారు.


