● పీయూ ఆధ్వర్యంలో కన్హా శాంతివనంలో ఉత్సాహంగా జాతీయ సెమినార్
● ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, పలు యూనివర్సిటీల వీసీలు
● సామాజిక మార్పుతోనే విజన్–2047 సాధ్యమన్న మంత్రి
● పీయూను అన్నిరంగాల్లో ముందుకు
తీసుకెళ్లేందుకు కృషి: వీసీ శ్రీనివాస్
● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల స్టాళ్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: దేశం అభివృద్ధి చెందాలంటే విద్య, యువత చేసే ఆవిష్కరణలే మూలం అవుతాయని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పీయూ ఆధ్వర్యంలో కన్హా శాంతివనంలో నిర్వహించిన విజన్–2047 ‘ఇంటిగ్రేషన్ సైన్స్, ఇన్నోవేషన్, అండ్ యూత్ ఎంపవర్మెంట్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విజన్–2047 లక్ష్యాలు చేరుకోవాలంటే ముఖ్యంగా దేశంలో శాసీ్త్రయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, కృత్రి మేధస్సు, డేటాసైన్స్, బయోటెక్నాలజీ, సెమీ కండక్టర్లు, పునరుత్పదాక ఇంధన, అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి సాధించనప్పుడే అనుకున్న లక్ష్యాలను నెరవేరుతాయన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ప్రగతి, ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమగ్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని వెల్లడించారు. ముఖ్యగా సమాజంలో కార్పొరేట్ వైపు ప్రజలు మెగ్గు చూపడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, విద్య, వైద్యం కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారని, దీని వల్ల రాష్ట్రంలో నూటికి 95 శాతం మంది అప్పుల్లో కూరుకుపోయారన్నారు. పరువు, హంగు ఆర్బాటాల కోసం పెద్దఎత్తున వేడుకలు చేస్తుండటం వల్ల మరిన్ని అప్పులు పెరుగుతున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కళాకారుల ఆధ్వర్యంలో సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యం చేసేందుకు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.
అభివృద్ధి పథంలో నడిపిస్తాం..
పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పీయూలో ఐదు క్యాంపస్ కళాశాలలు, ఐదు హాస్టళ్లు ఉన్నాయని, వీటిలో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు లా, ఇంజినీరింగ్ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అలాగే అధునాతన ల్యాబ్లు, లైబ్రరీలు, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించామన్నారు. 170 ఎకరాల విస్తీర్ణంలోని క్యాంపస్లో పచ్చని చెట్లతో విద్యార్థులకు ఆహ్లాదకర వాతారణం అందుతుందని చెప్పారు. అలాగే గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలోనూ విద్యార్థులకు పలు కోర్సుల్లో విద్య అందిస్తున్నామని, వారికి తరగతి గదులు, బాల, బాలికలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. పలు సెషన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సైంటిస్టులు, ప్రొఫెసర్లు తమ ప్రసంగాలను వినిపించారు.
సాంస్కృతిక, స్టాళ్ల ప్రదర్శనలు
జాతీయ సెమినార్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ కంపెనీలు, స్టార్టప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శన కార్యక్రమానికి హైలెట్గా నిలవగా మంత్రి జూపల్లి స్టాళ్లు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మహాత్మగాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వీసీ సూర్య ధనంజయ, గుల్బర్గా యూనివర్సిటీ వీసీ శశికాంత్ ఉడేకార్, పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, ప్రవీణ, కుమరస్వామి తదితరులు పాల్గొన్నారు.


