కల్వకుర్తి రూరల్: రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని స్టేడియంలో రూ.1.30 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లను పంపిణీ చేశారు. బీసీ బాలికల గురుకులంలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పెంచాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని.. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనందకుమార్, వైస్చైర్మన్ షాన్వా జ్ ఖాన్, కమిషనర్ మహమ్మద్ షేక్, విజయ్కుమార్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, రమాకాంత్రెడ్డి, సతీశ్, సంతు యాదవ్, బంగారి పాల్గొన్నారు.


