షెడ్యూల్ ఇలా..
నేటి నుంచి ప్రత్యేక రెండో విడత డిగ్రీ అడ్మిషన్లు
● టెక్నికల్ కోర్సుల్లో చేరేందుకు
సువర్ణావకాశం
● 11 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ
● 14న సీట్ల కేటాయింపు
డిగ్రీలో ప్రవేశం పొందని విద్యార్థులకు మంచి అవకాశం. ముఖ్యంగా ప్రభుత్వం ప్రారంభించిన టెక్నికల్ డిగ్రీ కోర్సులు నేటి పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. వీటితో డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి.
– మదన్మోహన్, ప్రిన్సిపల్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాగర్కర్నూల్
కల్వకుర్తి టౌన్: డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మరో అవకాశం కల్పించింది. 2026–27 విద్యా సంవత్సరానికి దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్–2 షెడ్యూల్ను ప్రకటించింది. మూడో దశలో సీటు పొందని విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గురువారం నుంచి ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలు..
విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్న డిగ్రీ టెక్నికల్ కోర్సుల్లో చేరేందుకు ప్రభుత్వం దోస్త్ స్పెషల్ డ్రైవ్ ద్వారా అవకాశం కల్పించింది. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో రెండేళ్ల అకాడమిక్ బోధన, ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ విధానంలో ప్రత్యేక కోర్సులను రూపొందించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించనున్నాయి. జిల్లాలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా.. అమ్రాబాద్ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు రాకపోవటంతో కేవలం 6 కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ డ్రైవ్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే సమయంలో ఆసక్తి గల విద్యార్థులు టెక్నికల్ కోర్సులను కూడా ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. పీహెచ్, సీఏపీ, ఎన్సీసీ, డ్రాపౌట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ కేటగిరీలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన 12న చేపట్టనున్నారు. 14న సీట్ల కేటాయింపు.. అదే రోజు నుంచి 18 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్.. 17, 18 తేదీల్లో సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, కళాశాలలను ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లుగా నమోదు చేస్తే సీటు లభించే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన అధికారిక షెడ్యూల్లో స్పెషల్ ఫేజ్ వరకు మాత్రమే తేదీలు ప్రకటించారు. స్పాట్ అడ్మిషన్ల తేదీలను ఇంకా ప్రకటించలేదు. అవి స్పెషల్ ఫేజ్ పూర్తయిన తర్వాత మిగిలిన ఖాళీ సీట్ల ఆధారంగా ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు.


