నాగర్కర్నూల్ రూరల్: రాష్ట్రంలో విద్యాశాఖకు వెంటనే పూర్తిస్థాయి మంత్రిని నియమించడంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఐఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రేమ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేని పరిస్థితి నెలకొందని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల భవనాలు అనేకచోట్ల శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అత్యవసరంగా మరమ్మతు చేసి అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మించి అన్ని మౌళిక వసతులు కల్పించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఫణి, అర్జున్, చరణ్, యశ్వంత్, అనిల్, రవీందర్, ప్రవీణ్, లక్ష్మణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


