పారదర్శకంగా అర్హుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా అర్హుల ఎంపిక

Apr 24 2025 12:44 AM | Updated on Apr 24 2025 12:44 AM

పారదర్శకంగా అర్హుల ఎంపిక

పారదర్శకంగా అర్హుల ఎంపిక

నాగర్‌కర్నూల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్‌ యువవికాసం పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌లో రాజీవ్‌ యువవికాసం దరఖాస్తుల విచారణ ప్రక్రియ, మండల స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటుపై అదనపు కలెక్టర్‌ దేవ సహాయంతో కలిసి సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీవ్‌ యువవికాసం పథకానికి జిల్లావ్యాప్తంగా 42,335, దరఖాస్తులు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 50వేల వరకు వందశాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90శాతం, రూ. 2లక్షల వరకు 80శాతం, రూ. 4లక్షల వరకు 70 శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేస్తుందన్నారు. ఇందుకు గాను ప్రణాళికా బద్ధంగా లక్ష్యాల కేటాయింపులు చేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల విచారణ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. మండలస్థాయిలో విచారణకు ఎంపీడీఓ, మండల ప్రత్యేకాధికారి, బ్యాంకు మేనేజర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ అధికారులు, డీఆర్డీఓ సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మండలస్థాయి విచారణ తదుపరి జిల్లా కమిటీ పరిశీలన చేస్తుందన్నారు. తుది జాబితాను ఆయా కార్పొరేషన్‌లకు పంపనున్నట్లు చెప్పారు. జిల్లాలో లాభదాయక యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమర్పించడంతో పాటు సదరు లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం త్వరగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఇళ్ల మంజూరు పూర్తిచేసి.. నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం..

ఊర్కొండ: రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని రూపొందించిందని ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. ఊర్కొండ రైతువేదికలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. గతంలో సరైన రిజిస్ట్రేషన్‌ లేకుండా జరిగిన సాదాబైనామా లావాదేవీలకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. అర్హులైన వారు నిర్దేశిత ప్రక్రియ ద్వారా తమ సాదాబైనామాలను క్రమబద్ధీకరించుకోవచ్చని సూచించారు. అంతే కాకుండా వారసత్వ భూముల విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. తహసీల్దార్‌ స్థాయిలో భూ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో బాధితులు ఆర్డీఓ, కలెక్టర్‌ లేదా సీసీఎల్‌ఏలకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ అప్పీల్‌ ప్రక్రియ కూడా నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయబడుతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మరింత పారదర్శకత, కచ్చితత్వం కోసం ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని కలెక్టర్‌ వెల్లడించారు. భవిష్యత్‌లో భూ సరిహద్దులు, యజమానికి సంబంధించిన వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్‌ ఎండీ యూసుఫ్‌ అలీ, ఎంపీడీఓ కృష్ణయ్య, ఏఓ దీప్తి, ఆలయ కమిటీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, రమేశ్‌ నాయక్‌, అయూబ్‌ పాషా, అబ్దుల్‌ సమీ, వహిదుద్దీన్‌, మనోహర్‌ రెడ్డి, ధర్మేందర్‌ రెడ్డి, మ్యాకల శ్రీనివాసులు, ఆదినారాయణ ఉన్నారు.

‘రాజీవ్‌ యువవికాసం’లో లాభదాయక యూనిట్ల ఏర్పాటుకు చర్యలు

ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయేందిర బోయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement