పునరావాస పనుల్లో వేగం పెంచాలి
కల్వకుర్తి: డిండి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 రిజర్వాయర్లకు సంబంధించిన భూసేకరణతో పాటు పునరావాస కేంద్రాల పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ, భూసేకరణ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వెల్దండ, చారకొండ మండలాల పరిధిలో రిజర్వాయర్ల కోసం భూసేకరణ, పరిహారం చెల్లింపు, అవార్డు ప్రక్రియలు, పునరావాస కేంద్రాల ఏర్పాటు పనుల ప్రగతిని సమీక్షించారు. ప్యాకేజీ–1 లో వంగూరు మండలంలోని 995.39 ఎకరాలు, ప్యాకేజీ–2లో చారకొండ, వెల్దండ మండలాల్లోని 2,144.16 భూ సేకరణ పనులు ఇదివరకే పూర్తి చేశామని, మిగిలిన 51 ఎకరాల భూమిని వెంటనే సేకరించాలని కల్వకుర్తి ఆర్డీఓను ఆదేశించారు. భూ సేకరణ పూర్తయిన వద్ద నీటిపారుదల అధికారులు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ముంపుకు గురవుతున్న గ్రామాల పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ముంపునకు గురవుతున్న ఎరవ్రల్లి గ్రామ పునరావాసానికి కల్వకుర్తి మండలంలోని పంజుగుల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణరెడ్డి, డివిజన్లోని తహసీల్దార్లు కార్తీక్ కుమార్, ఉమ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, భూసేకరణ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు వరం
వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. వంగూరు మండల కేంద్రంలో రూ.12.50 కోట్లతో నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అభివృద్ధి కమిటీ, అధికారులతో సమావేశమై టీపీఎస్ పాఠశాల నిర్మాణం పూర్తయితే పేద విద్యార్థులకు మేలు మేలు జరుగుతుందన్నారు. సమావేశంలో డీఈఓ రమేష్కుమార్, తహసీల్దార్ మురళీమోహన్, ఎంపీడీఓ బ్రహ్మచారి, ఎంఈఓ మురళీమనోహరాచారి, నోడల్ అధికారి నర్సిరెడ్డి, సర్పంచ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో
పురోగతి సాధించాలి
నాగర్కర్నూల్: జిల్లా ప్రజలకు కలెక్టర్ బదావత్ సంతోష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి ప్రతి విభాగంలో జిల్లా ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతియుత వాతావరణంలో జీవించాలని తెలిపారు.


