
మెరుగైన విద్య అందించాలి
తిమ్మాజిపేట/తెలకపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తిమ్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుదవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తెలకపల్లి సీఎల్ఆర్ విద్యాసంస్థల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుపై కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. విద్యార్థులు అత్యాధునిక విద్యా ప్రమాణాలతో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం చైర్మన్ను సత్కరించారు. ఆయన వెంట అధికారులు రాధాకృష్ణ, శివరాం, రామరాజు, మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ జాకీర్ అలీ, ఎంఈఓలు శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణశెట్టి, సీఎల్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం లక్ష్మారెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, రాజమహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.
సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతరకు జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ యా దయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని.. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
బల్మూర్: జిల్లాలో అవకతవకలకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా హౌసింగ్ పీడీ సంగప్ప అన్నారు. బుధవారం బల్మూర్లో మోడల్ ఇందిరమ్మ హౌస్ నిర్మాణంతో పాటు పైలెట్ గ్రామం జిన్కుంటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలో మొదటి విడతగా 353 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. బల్మూర్ మండలం జిన్కుంట గ్రామానికి 73 ఇళ్లు మంజూరైనట్లు చెప్పారు. ఇందులో 50 ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ ఇవ్వగా.. 12 నిర్మాణాలు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయని వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా జియో ట్యాంగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసినప్పటి నుంచి.. నిర్మాణం పూర్తయ్యే వరకు పకడ్బందీగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. పీడీ వెంట డీఈ ఆనంద్రెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ రాఘవులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, భూషన్న ఉన్నారు.
దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్
కందనూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాస పథకంలో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారిణి కె.రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయేతర రుణాలకు దరఖాస్తు చేసుకునే వారు 21–55 ఏళ్లు, వ్యవసాయ రుణాలకు దరఖాస్తు చేసుకునే వారు 21–60 ఏళ్లు ఉండాలన్నారు. ఆసక్తిగల దివ్యాంగులు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మెరుగైన విద్య అందించాలి