ప్రజా సంక్షేమమే ధ్యేయం
చారకొండ: పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ ప్రతిష్టతను మరింత పెంచేందుకు కార్యకర్తలు, నాయకులు నిరంతరం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కలిసికట్టుగా ఉండాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారం చేపడితే రాష్టంలో సుస్థిర పాలన కొనసాగుతుందని అన్నారు. ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషిచేస్తానని చెప్పారు. మండలంలో ఇప్పటికే దళిత కుటుంబాలకు రూ.10 లక్షల స్వయం ఉపాధికి అవకాశం కల్పించామన్నారు. ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీఆర్ఎస్ ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని, అందుకోసమే దేశమంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు. అనంతరం గ్రామాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పనితీరు, చేయాల్సి పనులు, సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.