ఏటూరునాగారం: ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తామని ఐటీడీఏ ఏపీఓ, ఎస్డీసీ(స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) ప్రతాప్, డీడీ జనార్దన్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏటూరునాగారం బస్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. వైజంక్షన్ వద్ద, ఐటీడీఏ కార్యాలయంలోని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజన భవన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివాసీల అభివృద్ధి, ఎదుగుదలకు ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఆదివాసీలకు ప్రత్యేక నిధులు, పథకాలను అందిస్తుందని వివరించారు. ఐటీడీఏ ద్వారా అనేక గిరిజన గ్రామాలకు రోడ్లు, విద్యుత్, తాగునీటి వసతి వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. ఆదివాసీలకు సైతం ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈఈ ప్రవీణ, డీటీ అనిల్, పెనక ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్డీసీ ప్రతాప్, డీడీ జనార్దన్


