● బాలికల ఆశ్రమ పాఠశాలకు రక్షణ కరువు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని తాళ్లగడ్డ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రహరీ ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయింది. బాలికలకు రక్షణగా ఉండే ప్రహరీ కూలిపోయినా సంబంధిత ఆశ్రమ పాఠశాల వార్డెన్, ప్రధానోపాధ్యాయులు ఈ విషయంపై ఏమాత్రం స్పందించడం లేదు. ప్రహరీ లేకపోవడంతో అపరిచిత వ్యక్తులు రాత్రి సమయాల్లో లోనికివెళ్లే ప్రమాదం ఉంది. ప్రహరీ కూలిపోయిన విషయాన్ని ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ డీడీ, ఇంజనీరింగ్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్, ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. బాలికల రక్షణకు వెంటనే నూతనంగా ప్రహరీని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంపై డీడీ జనార్దన్ ను వివరణ కోరగా అక్కడ ఉన్న పరిస్థితి వెంటనే పరిశీలించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.


