కాశిబుగ్గ: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి డాక్టర్ రోహిత్ బస్రే స్పష్టం చేశారు. స్టైఫండ్ పెంపుకోసం వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో తెలంగాణ ఆయుష్ జేఏసీ చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ హౌస్సర్జన్లకు సమాన పనికి సమానవేతనం అందే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవరసమైతే సమస్యల పరిష్కారం కోసం ఆత్మార్పణ ఘోష చేయడానికి వెనుకాడనని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్టైఫండ్ను పెంచడంతో పాటు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నిరవధిక సమ్మె గురించి ప్రభుత్వానికి తెలపాలని కోరుతూ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనసూయ, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మారాజుకు హౌస్సర్జన్లు వినతిపత్రం సమర్పించారు. అలాగే, స్టైఫండ్ పెంపు విషయంపై వారు వివరించారు.
విశ్వ ఆయుర్వేద పరిషత్,
ఎన్ఎంఏ సభ్యుల మద్దతు..
ఆయుష్ హౌస్సర్జన్లకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు విశ్వ ఆయుర్వేద పరిషత్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిషన్, నేషనల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ చిలువేరు రవీందర్, డాక్టర్ మోహన్రావు, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ సాంబమూర్తి తెలిపారు. అదేవిధంగా అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల అండర్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులు కూడా మద్దతు ప్రకటించారు.
తెలంగాణ ఆయుష్ జేఏసీ కార్యదర్శి
డాక్టర్ రోహిత్ బస్రే


