గోవిందరావుపేట: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని వీరపనేని రామదాసు, వెంకటసుబ్బమ్మ దంపతుల స్ఫూర్తితో క మ్యూనిస్టు కార్యకర్తలు ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని కమ్మ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన వీపనేని రామదాసు వెంకటసుబ్బమ్మ దంపతుల 6వ వర్థంతి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్దాలు, ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో విద్య, వైద్యం, ఉపాధి రంగాలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. దేశంలో యువత ఉపాధి, నాణ్యమైన విద్య, ప్రజాస్వామ్య హక్కుల కోసం చైతన్యంతో ఉద్యమించడం శుభపరిణామమన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ పేరుతో గిరిజనులు, దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంతకుముందు పార్టీ సీనియర్ నాయకుడు గుండు సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించగా, రామదాసు వెంకటసుబ్బమ్మ దంపతుల విగ్రహాలకు నాయకులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రత్నం రాజేందర్, పొదిళ్ల చిట్టిబాబు, రఘుపతి, వాసు, దావుద్, మండల కార్యదర్శి మల్లారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రామదాసు స్ఫూర్తితో
ఉద్యమాలను బలోపేతం చేయాలి
సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి
శ్రీనివాసరావు


