
వినతుల వెల్లువ
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో 15మంది గిరిజనుల నుంచి ఏపీఓ వసంతరావు, డీడీ పోచం వినతులు స్వీకరించారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు తలసేమియాతో బాధపడుతున్నాడని, ట్రైబల్ రిలీఫ్ ఫండ్, వికలాంగుల పింఛన్ ఇప్పించాలని వేడుకున్నారు. మంగపేట మండలం మల్లూరుకు చెందిన ఓ విద్యార్థి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి సీటు ఇప్పించాలని కోరారు. వాజేడు మండలం అయ్యవారిపేటకు చెందిన ఓ గిరిజన అభ్యర్థి ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ఉపాధి కల్పించాలని వేడుకున్నారు. మహబూబాబాద్ మండలంలోని ఓ పేద మహిళ ఐటీడీఏ ద్వారా ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. గూడూరు మండలానికి చెందిన తన తండ్రి జీసీసీ సేల్స్మన్గా పనిచేస్తూ మరణించారని, ఆ ఉద్యోగం తనకు ఇప్పించాలని వేడుకున్నారు. కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో 52 సర్వే నంబర్లో సాగు చేసుకుంటున్నానని, ఆ భూమిని వేరే వారి పేరుమీద పట్టా చేసుకున్నారని, తనపై కబ్జాదారుడు దాడి చేసి గాయపర్చాడని న్యాయం చేయాలని ఓ బాధితుడు వేడుకున్నారు. గోవిందరావుపేట మండలం చెందిన ఓ విద్యార్థికి జంగాలపల్లి ఎస్టీ గురుకులంలో 9వ తరగతి సీటు ఇప్పించాలని వేడుకున్నారు. గోవిందరావుపేట మండలం బొల్లెపల్లికి చెందిన ఓ గిరిజన మహిళా ఇందిరమ్మ ఇల్లు కావాలని ఏపీఓకు మొరపెట్టుకున్నారు. అలాగే ఇదే మండలం చల్వాయికి చెందిన గిరిజన నిరుద్యోగి జిరాక్స్ షాపు పెట్టుకునేందుకు రుణం మంజూరు చేయాలని విన్నవించారు. గూడూరు మండలం భూపతిపేటకు చెందిన మాలతి నర్సు ట్రైనింగ్ పూర్తి చేశానని, ఏదైనా ఆస్పత్రిలో నర్సు పోస్టు ఇప్పించాలని కోరారు. ఏటూరునాగారం మండలం చెల్పాకకు చెందిన ఓ గిరిజన రైతు సోలార్ పంపుసెట్ కావాలని ఆర్జీ పెట్టుకున్నారు. ఏటూరునాగారం మండలం వీరాపురం గ్రామానికి చెందిన రైతు సోలార్ పంపుసెట్ కావాలని కోరారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో సైతు గుట్ట వద్ద కొత్త కరెంటు లైన్ నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, జియాలజిస్ట్ అల్లెం కిషోర్, ఐటీఐ ప్రిన్సిపల్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
ఐటీడీఏ ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు
గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడి

వినతుల వెల్లువ