
అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలి
ములుగు రూరల్: అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయం ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 1నుంచి 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్కు విన్నవించగా ప్రభుత్వం వేసవి సెలవులు ఇవ్వడానికి పరిశీలన చేస్తుందన్నారు. పోషన్ పక్వాడలో మంత్రి సీతక్కకు వేసవి సెలవులు ఇవ్వాలని వినతి అందించగా సెలవులు ఇస్తామని హామీనిచ్చి అమలు చేయలేదన్నారు. పాత పద్ధతిలో 15 రోజలు టీచర్, 15 రోజులు ఆయాలు విధులు నిర్వహించేలా సర్క్యూలర్ జారీ చేశారని వివరించారు. ఎండల తీవ్రత కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు, గర్భిణులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. అనంతరం మంత్రి సీతక్కతో యూనియన్ నాయకులు ఫోన్లో మాట్లాడారు. వేసవి సెలవుల విషయంలో యూనియన్ నాయకులు చర్చలకు రావాలని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, అంగన్వాడీలు సమ్మక్క, సరిత, జమునారాణి, ధనలక్ష్మీ, అరుంధతి, పార్వతీ, సూరమ్మ పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట
యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా