
‘మంత్రుల మతి భ్రమించింది’
ములుగు: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వచ్చిన జనం, పార్టీ అధినేత ప్రసంగం చూసి రాష్ట్ర మంత్రుల మతి భ్రమించిందని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు సానికొమ్మ రమేష్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగంలో పసలేనప్పుడు ఉలికిపాటు ఎందుకని మంత్రి సీతక్కను ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. మంత్రి సీతక్క ఎలాంటి అభివృద్ధి చేశారో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. పెద్దపెద్ద కాన్వాయ్లో తిరిగితే మహిళల సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు రాసమల్ల సురేందర్, మాజీ ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్రమౌళి, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, గొర్రె సమ్మయ్య, బైకాని సాగర్, మెరుగు సంతోష్, విజయ, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.