
‘భూభారతి’తో భూ సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ టీఎస్.దివాకర
వాజేడు: దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతుల భూములకు సంబంధించి పాస్ పుస్తకాల్లో ఉన్న పొరపాట్ల సవరణకు సైతం అవకాశం ఉందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం నిర్వహించిన సదస్సులో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రతా భావానికి తావు లేకుండా జవాబుదారి తనాన్ని పెంచేందుకు భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు, సాదా బైనామా వంటి సేవలు సులుభ తరం అవుతాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే గ్రామాల్లోని ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని వివరించారు. జిల్లాలో ఉన్న అసైన్మెంట్, సాదా బైనామాలు, పాస్ పుస్తకాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో భూములకు సంబంధించిన సర్వేలు చేసి కొలతలు, హద్దులు, భూముల వివరాలను ఒకే పుస్తకంలో ఉండేలా ఆధార్ తరహాలో భూధార్ను రూపొందించ నున్నట్లు వెల్లడించారు. భూ భారతి చట్టం ద్వారా భూమికి సంబంధించిన సమస్యలు జిల్లా స్థాయిలో సత్వరమే పరిష్కరించబడుతాయని వివరించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చింతూరు, లక్ష్మీపురం, ఆర్లగూడెం గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట దెబ్బతిందని తమకు న్యాయం చేయాలని రైతులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సదస్సులో మండల ప్రత్యేకాధికారి సర్ధార్ సింగ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
విశ్వ సుందరీమణుల రాకకు ఏర్పాట్లు
వెంకటాపురం(ఎం): వచ్చే నెల 14వ తేదీన విశ్వ సుందరీమణుల రాక సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు బుధవారం రామప్ప ఆలయం, హరితహోటల్, ఇంటర్ర్పిటేషన్ సెంటర్లలో చేస్తున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామప్పను సందర్శించడానికి వచ్చే విశ్వ సుందరీమణుల కోసం స్వాగత ఆర్చ్, ఆలయంలో లైటింగ్తో సుందరీకరణ, గ్రీనరీ పెంచడం, కాకతీయ కట్టడాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయడానికి విదేశీ పర్యాటకుల కోసం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా దేశాల సుందరీమణులను పర్యాటక ప్రాంతాలకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, పర్యాటక అభివృద్ధి శాఖ అధికారులు, పురావస్తుశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.