మంత్రి పొంగులేటికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వినతి
ములుగు రూరల్: యాసంగి సాగులో వరి ధాన్యం దిగుమతి చేసుకోలేమని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భాదం ప్రవీణ్కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సాగు ధాన్యం కేవలం బాయిల్డ్ బియ్యం మాత్రమే అవుతాయని, రారైస్ అయినా అవి తినడానికి వీలుగా ఉండవన్నారు. స్పందించిన మంత్రి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. పల్లెపాటి సమ్మిరెడ్డి, అనిల్, హరినాఽథ్ తదితరులు ఉన్నారు.
ఆదివాసీ సమస్యలపై పోరాటం
వెంకటాపురం(కె): ఆదివాసీ సమస్యలపై యువత అలుపెరుగని పోరాటం చేయాలని తెలంగాణ భూమి పుత్ర ఆదివాసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పూనం రాంచందర్ అన్నారు. శుక్రవారం టీబీఏఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో ఆదివాసీ సమస్యలు, చట్టాలు, హక్కులపై పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసం లక్ష్మయ్య, పూనెం మునేశ్వరరావు, తాటి లక్ష్మణ్, పొడెం రాకేష్, ఇరుప లక్ష్మి, స్వరూప, ఉషారాణి, సుశీల, నాగరాజు తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి
వాజేడు: మే 5న నిర్వహించతలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ కోరారు. మండల పరిధిలోని పేరూరులో శుక్రవారం ఏటూరునాగారం డివిజన్ అధ్యక్షుడు టింగ బుచ్చయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను కాపాడుతామని చెబుతూనే గిరిజనేతరులకు హక్కులు కల్పించడానికి కుట్ర చేస్తుందన్నారు. చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆదివాసీ ప్రజలు, యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నర్సింహరావు, సుధాకర్, మనోజ్, కృష్ణబాబు, రాంబాబు, నర్సింహరావు, అర్జున్ తదితరులు ఉన్నారు.
భద్రకాళి సన్నిధిలో ఐటీడీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ఐటీడీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ బానోత్ శరత్నాయక్ కుటుంబసమేతంగా సందర్శించారు. వారిని ఆలయ అధికారులు స్వాగతించారు. ముందుగా వారు ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం శరత్నాయక్ దంపతులకు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.
నేటినుంచి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మె
కేయూ క్యాంపస్: కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు కేయూ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (కుక్టా) అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్కుమార్లోథ్ శుక్రవారం తెలిపారు. ఇప్పటికే యూనివర్సిటీ అధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చామని పేర్కొన్నారు. నేడు పరిపాలనాభవనం వద్ద నిరసన దీక్షలు చేపట్టాలని యోచిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రభుత్వం జారీచేసిన 21 జీఓను వ్యతిరేకిస్తున్నామని, దీనిలో సవరణలు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాకే మిగతా పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

యాసంగి ధాన్యం దిగుమతి చేసుకోం..