శ్రీకారం చుట్టుకుంది కొత్త చిత్రం

Tollywood Industry Announces New Movies On The Occasion Of Ugadi - Sakshi

ప్రతి ఉగాదికి నూతన చిత్రాల ప్రారంభోత్సవాలు, షూటింగ్‌ అప్‌డేట్స్‌తో తెలుగు పరిశ్రమ కళకళలాడుతుంటుంది. ఈ ఏడాది ఉగాది కూడా సంతోషాన్ని తీసుకువచ్చింది. కొత్త చిత్రాల ప్రారంభోత్సవాలు, నిర్మాణంలో ఉన్న చిత్రాల విశేషాలు, భవిష్యత్తులోపట్టాలెక్కే చిత్రాల కబుర్లతో పండగ జోష్‌ కనిపించింది. 

పండగ పూట.. కొత్త పాట
హైదరాబాద్‌లో కొత్త పాట మొదలుపెట్టారు మహేశ్‌బాబు. ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న ‘సర్కారువారిపాట’ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ మంగళవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఇందులో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌  సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి సందర్భంగా ‘సర్కారువారి పాట’ విడుదల కానుంది.

నో టెన్షన్‌.. ఓన్లీ ఫన్‌
‘ఎఫ్‌ 3’ సినిమా సెట్‌లో మళ్ళీ ఫన్‌ మొదలైంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఇది. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌  హీరోయిన్లు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ మంగళవారం మొదలైంది. ‘‘ఎఫ్‌ 3’ సెట్స్‌లో ఫన్‌  మళ్లీ మొదలైంది. ఈ ఏడాది అంతా సంతోషం, హంగామాలతో నిండిపోవాలి. ఆందోళనలకు, బాధలకు చోటు ఉండకూడదు’’ అని పేర్కొన్నారు అనిల్‌ రావిపూడి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 27న విడుదల చేయాలనుకుంటున్నారు.

రవితేజ హీరోగా రూపొందనున్న తాజా చిత్రం హైదారాబాద్‌లో ఆరంభమైంది. శరత్‌ మండవ  ఈ చిత్రానికి తొలి సన్నివేశానికి నిర్మాత రవిశంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, రవితేజ క్లాప్‌ ఇచ్చారు,  ఈ చిత్రనిర్మాత సుధాకర్‌ చెరుకూరి స్క్రిప్ట్‌ను శరత్‌కు అందించారు. దివ్యాంశా కౌశిక్‌ హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. 

‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ అఖిల్‌ సార్ధక్‌ హీరోగా ఐ.హేమంత్‌ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్‌ టైమ్‌’. అనిక విక్రమన్‌  హీరోయిన్‌ గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఆరంభమైంది. దర్శకుడు జి. నాగేశ్వర్‌ రెడ్డి ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఎమ్‌.ఎల్‌.ఎ రఘునందన్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యానారయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్‌ అడ్వంచర్‌ మూవీని ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు.

నూతన నటీనటులతో నిర్మాతలు ఐ. సతీష్‌కుమార్, కల్యాణ్‌ సుంకరలు ఓ సినిమాను ప్రారంభించారు. తొలి సన్నివేశానికి నటుడు అలీ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ క్లాప్‌ ఇచ్చారు. రాజ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆర్‌పీ పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నారు. మే నెలలో షూటింగ్‌ ప్రారంభించి అదే నెలలో చిత్రీకరణ పూర్తి చేస్తామని, చిత్రబృందం తెలిపింది.

ఆర్‌జీవీ దెయ్యం
హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రామ్‌గోపాల్‌వర్మ (ఆర్‌జీవీ) సినిమాలంటే ఆడియన్స్‌లో ఓ స్పెషల్‌ ఎటెన్షన్‌ ఉంటుంది. ఆర్‌జీవీ డైరెక్షన్‌ లో వస్తున్న హారర్‌ సినిమాల సిరీస్‌లో రూపొందిన మరో చిత్రం ‘ఆర్‌జీవీ దెయ్యం’. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. రాజశేఖర్, స్వాతీ దీక్షిత్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. జీవితా రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్‌ ఈ సినిమాకు నిర్మాతలు. ‘‘రాజశేఖర్, నేను ఎవరికి వాళ్లం బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. ఇందులో రాజశేఖర్‌ కూతురిగా దీక్ష నటించారు’’ అని విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top