నటించడం ఇష్టంలేక భారీ రెమ్యునరేషన్‌ అడిగా.. ఇచ్చేశారు: తమ్మారెడ్డి | Tammareddy Bharadwaja Talk About O Andala Rakshasi Movie | Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ ఈ సినిమాకే తీసుకున్నా: తమ్మారెడ్డి

Mar 19 2025 5:59 PM | Updated on Mar 19 2025 6:11 PM

Tammareddy Bharadwaja Talk About O Andala Rakshasi Movie

దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం రాబోతోంది. మార్చ్ 21న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ .. 'భాష్య శ్రీ ఈ కథను నా వద్దకు తీసుకువచ్చారు. ఈ సినిమాను కచ్చితంగా చేయాలని చెప్పారు. వీళ్ళని ఎలాగైనా వదిలించుకోవాలని పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ చెప్పాను. అంత వీళ్ళు ఎలాగో ఇవ్వరు నన్ను వదిలేస్తారని అనుకున్నాను. కానీ నేను అడిగినంత డబ్బు ఇచ్చారు. నేను మళ్ళీ అడగకముందే డబ్బులు ఇచ్చేశారు. నా ఇన్నేళ్ల కెరీర్లో ఇంత మొత్తం చూసింది ఇదే మొదటిసారి. ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా కథ చాలా బాగుంది. నాకు స్క్రిప్ట్ కూడా చాలా నచ్చింది. ఇలాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి. భాష్యశ్రీ కథ, షెరాజ్ టేకింగ్ బావుంది. మార్చ్ 21న రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. 'చిన్న చిత్రాల్లో నటించి మాలాంటి వాళ్లకు సపోర్ట్ ఇచ్చిన తమ్మారెడ్డి గారికి థాంక్స్. సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. నేను ఇప్పటివరకు ఆ క్రమశిక్షణతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ఇకపై కూడా అలానే చేస్తూ ఉంటాను. ఓ అందాల రాక్షసి సినిమా థియేటర్లోకి రానంతవరకే చిన్న సినిమా. ఒకసారి మా సినిమా థియేటర్ లోకి వచ్చాక దాని రేంజ్ ఏంటో ఆడియన్స్ కి తెలుస్తుంది. టీమ్ అంతా కలిసి ఒక ఫ్యామిలీలా ఈ సినిమాను పూర్తి చేశాం. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మా చిత్రం మార్చి 21న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి' అని అన్నారు.

భాష్య శ్రీ మాట్లాడుతూ .. 'మాలాంటి చిన్న సినిమాలో మంచి పాత్రను పోషించి,  మాకు అండగా నిలిచిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థాంక్స్. కథ చెప్పిన వెంటనే తమ్మారెడ్డి బ్రదర్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకు నిర్మాతకు థాంక్స్. ఇప్పుడు అందరూ ఈ సినిమాను చిన్న సినిమా అనుకుంటారు. కానీ దీని సత్తా ఏంటో రిలీజ్ అయ్యాకే మీ అందరికీ తెలుస్తుంది' అని అన్నారు.

నేహా దేశ్ పాండే మాట్లాడుతూ .. 'అమ్మాయిలు తమపై జరిగే మోసాలు దాడులను ఎలా ఎదుర్కోవాలి అనేది ఇందులో చక్కగా చూపించారు. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శక,నిర్మాతలకు థాంక్స్. మా చిత్రం మార్చ్ 21న రాబోతుంది అందరూ చూసి ఆదరించండి' అని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement