
సంధ్య థియేటర్.. హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఈ సినిమా హాల్ చాలా ఫేమస్. స్టార్ హీరోల అభిమానులంతా ఈ థియేటర్లోనే సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అలా అని ఇది లగ్జరీ థియేటర్ ఏం కాదు. చాలా కాలం నుంచి ఉండడం.. స్టార్ హీరోలు ఇక్కడకు వచ్చి సినిమా చూస్తుండడంతో ‘సంధ్య థియేటర్’ ఫేమస్ అయింది. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది కూడా ఈ థియేటర్లోనే. ఆ సమయంలో సంథ్య థియేటర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా మారుమోగింది.
తాజాగా మరోసారి ఈ థియేటర్ వార్తల్లో నిలిచింది. రోడ్డు పక్కనే ఉన్న ఈ సినిమా థియేటర్స్లో పాములు కలకలం రేపాయి. రూ. 50 టికెట్ ఇచ్చే ఎంట్రీ వద్ద ఓ పెద్ద పాము బుసలు కొడుతూ సిబ్బంది కంట పడింది. చాలా పొడవుగా ఉన్న ఆ పాముని చూసి బయపడి పోయిన సిబ్బంది..వెంటనే పాములు పట్టే స్నేక్ యూనిట్కి కాల్ చేసి రప్పించారు. వారు చాకచక్యంతో పాముని పట్టుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సంధ్య థియేటర్లో పాములు కనిపించడం ఇదేం తొలిసారి కాదు. తరచు థియేటర్స్లోకి పాములు వస్తున్నాయని సిబ్బంది చెబుతోంది.
వందల సంఖ్యలో జనాలు వచ్చే థియేటర్లో ఇలా పాములు రావడం ఏంటి? ఇప్పుడంటే లక్కీగా ప్రేక్షకులు లేరు కాబట్టి.. ప్రమాదం తప్పింది. ఒకవేళ థియేటర్లో ప్రేక్షకులు ఉన్నప్పుడే పాము వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అసలే సినిమా థియేటర్స్ చీకటిగా ఉంటాయి.. అలాంటి ప్రదేశాల్లోకి ఇలాంటి విష సర్పాలు రావడం ప్రమాదకరమే... యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
సంధ్య థియేటర్లో పాముల కలకలం
ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్లో రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు
పాములు తరచుగా లోపలికి వస్తున్నాయని సిబ్బంది ఆందోళన pic.twitter.com/l8Q6wDFH0N— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025