కామాటిపురను సందర్శించిన హీరోయిన్‌

Shweta Basu Prasad Visited Red Light Area Kamathipura, Mumbai - Sakshi

'కొత్త బంగారు లోకం'తో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ శ్వేతాబసు ప్రసాద్‌. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ సాధించి పెట్టినప్పటికీ తర్వాత చేసిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. అదే సమయంలో సెక్స్‌ రాకెట్‌లో ఇరుక్కోవడంతో విమర్శలపాలైంది. కానీ తర్వాతి కాలంలో ఈ కేసులో ఆమె నిర్దోషిగా తేలింది. మరోవైపు బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌ను పెళ్లాడినప్పటికీ, ఏడాది తిరిగేలోగా వారు విడాకులు తీసుకున్నారు. ఇలా వ్యక్తిగత జీవితంలో సమస్యలు వెంటాడటంతో ఆమె కెరీర్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది. తెలుగులో సరైన హిట్టు లేకపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చిన ఆమె ప్రస్తుతం "ఇండియా లాక్‌డౌన్"‌ అనే సినిమా చేస్తోంది. ఇందులో ఆమె సెక్స్‌ వర్కర్‌ మెహ్రునిస్సాగా కనిపించనుంది.

లాక్‌డౌన్‌లో ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులను చవిచూశారన్న అంశంతో మధుర్‌ బండార్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కోవిడ్‌ లాక్‌డౌన్‌ వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముంబైలోని రెడ్‌లైట్‌ ప్రాంతంలో నివసించే సెక్స్‌ వర్కర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో స్వయంగా తెలుసుకోవాలనుకుంది శ్వేతా. ఇందుకోసం ముంబైలోని రెడ్‌లైట్‌ ఏరియా కామాటిపురను సందర్శించిందట. (చదవండి: ఏ సినిమాకు శ్వేతా జాతీయ అవార్డు అందుకున్నారు?)

ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. "నేను చేసే పాత్రలు నిజమని నమ్ముతాను, అందులో లీనమైపోతాను. లేదంటే ప్రేక్షకులు ఆ పాత్రతో మమేకం కాలేరు. నా పాత్ర ఇంకా మెరుగ్గా వచ్చేందుకు మధుర్‌ సర్‌, నేను, నా టీమ్‌ మొత్తం రెండు వారాల క్రితం కామాటిపుర వెళ్లాం. అక్కడ వారి యాసను బట్టి నేను సినిమాలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నా. అంతే కాకుండా వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంది? వారి జీవితాలేంటో తెలుసుకున్నా. లాక్‌డౌన్‌ వాళ్ల వ్యాపారం మీదనే కాదు, వారి జీవితాల మీద కూడా గట్టి దెబ్బ కొట్టింది. కానీ అక్కడకు వెళ్లడం లైఫ్‌టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌గా నిలిచింది. ముఖ్య విషయమేంటంటే నేను అక్కడ మెహ్రునిస్సాను కలిశా. అచ్చంగా నా పాత్రే కళ్లముందు కనిపించినట్లైంది. కనుక నా పాత్రను ఆమెకు అంకితం చేస్తున్నా" అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో ఇప్పటివరకు పలువురు నటీమణులు వేశ్యపాత్రలను పోషించారు. చాందినీ బార్‌(2001)లో టబు, చమేలీ(2003)లో కరీనా కపూర్‌, ట్రాఫిక్‌ సిగ్నల్‌(2007)లో కొంకొణ సెన్‌శర్మ, మండీ(1983)లో శబానా అజ్మీ, స్మిత పాటిల్‌ సెక్స్‌ వర్కర్లుగా కనిపించిన విషయం తెలిసిందే. (చదవండి: ఇష్టమైన ఆహారంపై స్పష్టతనిచ్చిన ప్రియాంక చోప్రా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top