
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్( Shiva Rajkumar), రియల్ స్టార్ ఉపేంద్ర కలిసి నటించిన తాజా చిత్రం 45. ఎస్పీ స్వరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుమతి ఉమా రమేష్రెడ్డి, ఎం. రమేష్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జాన్య దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర తమిళ్ వెర్షన్ టీజర్ను చెన్నైలో విడుదల చేశారు. స్థానిక రాయపేటలోని పీవీఆర్ సత్యం థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు శివరాజ్ కుమార్, ఉపేంద్ర, నిర్మాత రమేష్ రెడ్డి, చిత్ర దర్శకుడు అర్జున్ జన్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటుడు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తాను చెన్నైకి ఎప్పుడు వచ్చినా సంతోషం కలుగుతుందన్నారు తాను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే అన్నారు. తనకు నటుడుగా తొలి అవకాశం వచ్చింది కూడా ఇక్కడే అని పేర్కొన్నారు. అలా పలు మధురమైన జ్ఞాపకాలు తనకు చెన్నైతో ముడిపడి ఉన్నాయని అన్నారు. కాగా తాను ఎప్పుడు హీరో కావాలని కోరుకోలేదని హీరో అంటే కమలహాసన్ ,అమితాబచ్చన్లో మాదిరి ఉండాలని అనుకునేవాడినని అన్నారు. వారే తన ఫేవరెట్స్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా నటుడు కమలహాసన్ తనకు స్ఫూర్తి అని ,తానే గనుక అమ్మాయినైతే ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే దానినని ఆయనది అంత అందం అని పేర్కొన్నారు.

తాను నటుడుగా మారిన తర్వాత చాలా జయాపజయాలను చవి చూశానన్నారు. అయినప్పటికీ వాటిని ఎప్పుడు తలకెక్కించుకోలేదని చెప్పారు. అదేవిధంగా జీవితంలో పలు మరణాలను, దుఃఖాలను ఎదుర్కొన్నానని, తనకు తలలో సర్జరీ జరిగిందని, అదేవిధంగా ఇటీవల క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. ఇకపోతే 45 చిత్రంలో నటించడం సంతోషకరమన్నారు. దర్శకుడు అర్జున్ జాన్య కథ చెప్పగానే నచ్చిందన్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇంతకుముందు ఎప్పుడూ రానటువంటి వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రం 45 అని, ఇది ఏ ఒక్క భాషకు చెందింది కాదని ఇండియన్ సినిమా అని నిర్మాత ఎం. రమేష్ రెడ్డి పేర్కొన్నారు.