తమిళ సినీ పరిశ్రమలో ఇద్దరు స్టార్ దర్శకులు శంకర్, ఏఆర్ మురుగదాస్ కలిసి పనిచేయనున్నారంటూ ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘మదరాసి’ విడుదలైన సమయంలో మురుగదాస్ పనితీరును శంకర్ ప్రశంసించడం కూడా ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. వీరిద్దరి కలయికపై వస్తున్న వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
శంకర్ టీమ్ కథతో మురుగదాస్?
శంకర్ రైటింగ్ టీమ్ సిద్ధం చేసిన ఓ కథపై ఏఆర్ మురుగదాస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఇది పూర్తిస్థాయి సినిమా కోసం జరుగుతున్న చర్చలా? లేక ప్రాథమిక కథా దశలోనే ఉందా? అనే దానిపై స్పష్టత రాలేదు. అలాగే ఈ ప్రాజెక్ట్లో శంకర్ కేవలం కథ అందిస్తారా? లేక మరేదైనా కీలక బాధ్యత తీసుకుంటారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ వార్తలపై అటు శంకర్, ఇటు మురుగదాస్గాని అధికారికంగా స్పందించలేదు.
ఇదీ చదవండి: అందుకే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పెట్టా..: విష్ణుప్రియ
ఎవరి సినిమాలతో వారు బిజీ..
శంకర్ ఇటీవల రామ్చరణ్తో ‘గేమ్ ఛేంజర్’, కమల్హాసన్తో ‘ఇండియన్ 2’ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన ‘వెల్పారి’ అనే చారిత్రక నవలను భారీ స్థాయిలో మూడు భాగాలుగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ను రూపొందించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది.
మరోవైపు ఏఆర్ మురుగదాస్ ఇటీవల శివకార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రల్లో ‘మదరాసి’ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్, సూర్య, అజిత్కుమార్, రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకులతోనూ ఆయన గతంలో సినిమాలు చేశారు. ప్రస్తుతం సన్నీ డియోల్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న హిందీ యాక్షన్ ఎంటర్టైనర్కు కూడా ఆయన దర్శకత్వం వహించనున్నారని సమాచారం.


