'సేవ్ ది టైగర్స్ 3' రివ్యూ.. ఈసారి కూడా నవ్వులే | Save The Tigers 3 Series Telugu Review | Sakshi
Sakshi News home page

Save The Tigers 3 Review: మరోసారి అలరించిన భార్యభర్తలు.. తెలుగు రివ్యూ

Jun 18 2026 6:27 PM | Updated on Jun 18 2026 6:48 PM

Save The Tigers 3 Series Telugu Review

'యాత్ర' సినిమాలు తీసిన మహి వి రాఘవ్ నుంచి వచ్చిన 'సేవ్ ది టైగర్స్' సిరీస్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇదివరకే రెండు సీజన్లు రిలీజ్ కాగా అవి బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సీజన్ తీసుకొచ్చేశారు. ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సీజన్ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథేంటి?
రాహుల్ (అభినవ్ గోమఠం) తనకు ఇష్టం లేకపోయినా బెంగళూరు వెళ్లి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటాడు. ఇది పోవడంతో మళ్లీ హైదరాబాద్‌కి వస్తాడు. జాబ్ పోయిన సంగతి తన భార్య మాధురి(పావని గంగిరెడ్డి)కి చెప్పకుండా దాచేస్తాడు. గంటా రవి (ప్రియదర్శి) ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులన్నీ వృథాగా ఖర్చు పెట్టి ఇంట్లో తిట్లు తింటూ ఉంటాడు. భార్య హైమా (సుజాత) పోరు భరించలేక గేటెడ్ కమ్యూనిటీలోకి వస్తారు. రేఖ (దేవియాని శర్మ) తన భర్త విక్రమ్ (చైతన్య కృష్ణ) నుంచి విడాకులు కావాలని కోర్టుకి వెళ్తుంది. కోర్టులో విక్రమ్.. తన భార్య రేఖ నుంచి భరణం కోరుతుంటాడు. ఇలా ఈ ముగ్గురూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతుంటారు.

ఈ పెళ్లిళ్ల కాన్సెప్ట్ పెట్టింది ఎవరు? పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటారని చెప్పింది ఎవరు? స్వర్గంలో పెళ్లిళ్లు నిర్ణయించబడతాయని చెప్పింది ఎవరు? అని ఫ్రస్ట్రేషన్‌లో నానా బూతులు తిడుతుంటారు. ఇవన్నీ స్వర్గంలో ఉన్న ఇంద్రుడు (వెన్నెల కిషోర్) వింటాడు. ఈ ముగ్గురి బాధ ఏంటో కనుక్కోండి.. వారి సమస్యకు పరిష్కారం చూపించండని గుప్తా (గుండు సుదర్శన్)కి ఇంద్రుడు ఆదేశాలు ఇస్తాడు. దీంతో ఆ గుప్తా ఈ మొదటి లోకంలో ఉన్న గంటా రవి, విక్రమ్, రాహుల్‌లను.. రెండో లోకంలో ఉన్న గంటా రవి, విక్రమ్, రాహుల్‌ని మార్చేస్తాడు. రెండో లోకంలోకి వెళ్లిన ఈ త్రయం ఏం చేసింది? మొదటి లోకం వచ్చిన ఆ ముగ్గురు ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
గతంలో వచ్చిన రెండు సీజన్లు సహజంగా ఉంటాయి. మూడో సీజన్‌కి వచ్చేసరికి కల్పితం ఎక్కువైంది. రెండు లోకాలు అనే కాన్సెప్ట్ పెట్టి మరింత ఆసక్తి పెంచారు. ఈ లోకంలో లేని మనశ్శాంతి, ప్రశాంతత వేరే లోకంలో ఉంటాయని ఈ త్రయం వెళ్లడం.. అక్కడికి వెళ్లిన మొదట్లో అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. అయితే మెల్లమెల్లగా అక్కడి సమస్యలు వారికి అర్థం అవుతాయి. అసలు ఈ మార్పిడి కాన్సెప్ట్‌కి ఆ ముగ్గురు ఎందుకు ఒప్పుకున్నారో.. ఈ ముగ్గురికి తెలుస్తుంది. మొదటి మూడు ఎపిసోడ్‌లు ఒక ఫేజ్‌లో నడుస్తాయి.

ఇక్కడ ఉండే గంటా రవికి వేరే లోకంలో ఉండే గంటా రవికి చాలా తేడాలు ఉంటాయి. రూపాలు ఒకేలా ఉన్నా గుణాల్లో మాత్రం చాలా వ్యత్యాసం చూపించారు. ప్రజల కోసం పాటు పడాలనే ఆలోచన గంటా రవికి ఉంటే.. ప్రజల్ని దోచుకోవాలనే దుర్బుద్ది రెండో ప్రపంచంలోని గంటా రవికి ఉంటుంది. అలా ప్రతీ పాత్రకు పాజిటివ్, నెగెటివ్ చూపించారు. అవన్నీ మనలోనే ఉన్నాయని, నెగెటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని మాత్రమే తీసుకోవాలనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చారు.

మహిళా సాధికారత గురించి చెప్పే సీన్లు, భార్య అంటే భర్తకు బానిస కాదు అని వివరించే సీన్లు చాలా బాగున్నాయి. ఎంతగా నవ్విస్తారో.. అంతగా ఆలోచింపజేస్తారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి అన్యోన్యత ఉండాలనే దాన్ని కూడా అభినవ్-పావని, చైతన్య-దేవియాని శర్మ పాత్రలతో చూపించారు. కొన్ని చోట్ల డైలాగ్స్ మితిమీరినట్లు అనిపిస్తాయి కానీ ఓటీటీ కాబట్టి సమస్యలా అనిపించదు. ఒకటి రెండు చోట్ల తప్పితే మిగతా సిరీస్ అంతా ఫ్యామిలీ కలిసి చూసేలా ఉంటుంది. ఓటీటీ కంటెంట్ అయినా కూడా ఎక్కడా అసభ్యతకు, అశ్లీలతకు తావివ్వకుండా తీశారు.

ఎవరెలా చేశారు?
భర్తలుగా అభినవ్, చైతన్య కృష్ణ, ప్రియదర్శిలు ఈసారి కూడా ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరికీ రెండు రకాలుగా యాక్టింగ్ చేసే అవకాశం దొరికింది. దానికి న్యాయం చేశారు. భార్యలుగా సుజాత, దేవయాని శర్మ, పావని అద్బుతంగా నటించారు. మిగిలిన పాత్రధారులు కూడా నవ్వించారు. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. క్రియేటర్ మహి.వి రాఘవ్ మరోసారి అదరగొట్టేశారు. ప్రదీప్ అద్వైతంతో కలిసి మళ్లీ హిట్ కొట్టారు. శ్రీరామ్ ఎరగం దర్శకత్వం కూడా బాగుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement