OTT Movies: ఓటీటీలోకి సంక్రాంతి బ్లాక్ బస్టర్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sankranthi Movies Ready To Streaming on OTT Platform - Sakshi

సంక్రాతి బరిలో నిలిచి సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ  చిత్రాలు ఓటీటీలోనూ అలరించనున్నాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలు స్ట్రీమింగ్‌ అవుతుండగా..  మిగతా సినిమాలు వచ్చే వారం స్ట్రీమింగ్‌ కానున్నాయి. థియేటర్లలో చూడలేక మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు.  ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. 

ఓటీటీలో వీరసింహారెడ్డి

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కళ్యాణం కమనీయం
యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. పేపర్‌ బాయ్‌ చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు ఏక్‌ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. తాజాగా ఈ ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.  

తునివు
తమిళ స్టార్ హీరో అజిత్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ తునివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్‌లో తెగింపు పేరుతో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అలరిస్తుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది.

వచ్చేస్తున్న వారసుడు

దళపతి విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారిసు(వారసుడు). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచింది. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించాడు. సంక్రాంతికి రిలీజైన వారసుడు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top