కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా ఆ పాటలో నటించాను: సమంత | Samantha Interesting Comments On Pushpa Special Song | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా ఆ పాటలో నటించాను: సమంత

Jun 7 2024 9:41 AM | Updated on Jun 7 2024 9:57 AM

Samantha Interesting Comments On Pushpa Special Song

తమిళసినిమా: వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగానూ నటి సమంత ఒక సంచలనమే. మొదట్లో తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించినా, తెలుగులో నటించిన తొలి చిత్రం ఏమాయ చేసావే సక్సెస్‌ ఆమె నట జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత తెలుగులో స్టార్‌ హీరోలతో జత కట్టే అవకాశాలు వరుస కట్టడంతో స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకున్నారు. ఆ తరువాత తమిళంలో విజయ్, సూర్య, విశాల్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు వరించాయి. అలా తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న సమయంలోనే టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

అయితే ఆ వివాహ జీవితం ఎక్కువ కాలం సాగలేదు. అభిప్రాయభేదాల కారణంగా విడిపోయారు. ఈ విషయాన్ని పక్కన పెడితే సమంత ఐటమ్‌ సాంగ్‌ చేసిన చిత్రం పుష్ప. అల్లుఅర్జున్‌ , రషి్మక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం 2022లో విడుదలై ఎంత సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విజయంలో సమంత నటించిన ఊ అంటావా మామ పాటకు అధిక భాగమే ఉంది. ఆ పాటలో సమంత శృంగార భరిత నటన యువతను గిలిగింతలు పెట్టించింది. ఆ పాటకు డాన్స్‌ చేయడానికి సమంతకు రూ. 5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ పాటలో నటించవద్దని తన కుటుంబసభ్యులు,స్నేహితులు చెప్పారని సమంత ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. 

అందులో ఆ సమయంలో తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని, అలాంటి సమయంలో పుష్ప చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో నటించవద్దని కుటుంబసభ్యులు, సన్నిహితులు చెప్పారన్నారు. అయితే తాను వారి వ్యతిరేకతను మీరి ఆ పాటలో నటించానని పేర్కొన్నారు. ఆ పాట పెద్ద టర్నింగ్‌ గా మారిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. నిజం చెప్పాలంటే ఆ అవకాశాన్ని కాదనడానికి తన వద్ద సరైన కారణం లేదన్నారు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని నిరాకరించాలి, తానే తప్పు చేయలేదు అని అన్నారు. 

వివాహా జీవితంలోనూ తాను వంద శాతం నిజాయితీగా ఉన్నానని చెప్పారు. అయితే అది తనకు వర్కౌట్‌ కాలేదని అన్నారు. సమంత చెప్పిన ఈ విషయం పాతదే అయినా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా మైయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత  ఖుషీ చిత్రం తరువాత మరో చిత్రం నటించలేదు. కాగా  సమంత ఇప్పుడు తన సొంత నిర్మాణంలో చిత్రం చేసి తన మార్కెట్‌ను తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈమె ట్రెండింగ్‌లోనే ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement