
స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అభిమాని గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలో 2023లో ఓ చిన్నపాటి విగ్రహంతో ఈ గుడిని నిర్మించారు. ఇటీవల ఆ గుడిలో గోల్డెన్ కలర్ సామ్ విగ్రహాన్ని పెట్టి.. సమంత బర్త్డే(ఏప్రిల్ 28) నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు అనాథ పిల్లలకు సదరు అభిమాని.. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా గుడి విషయంపై సమంత స్పందించారు. గుడి కట్టిన విషయం తెలియగానే హ్యాపీగా ఫీలయ్యా కానీ..ఇలాంటి ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ.. అభిమాని గుడి కట్టిన విషయంపై స్పందించారు. అభిమాని నా పట్ల ఇంత ప్రేమ చూపించడం తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అయితే, నేను ఇలాంటి చర్యలను ప్రోత్సహించను. అభిమానులు తమ ప్రేమను సానుకూల మార్గాల్లో, సమాజానికి మేలు చేసే విధంగా చూపించాలని కోరుకుంటాను," అని అన్నారు. సమంత ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక శుభం విషయానికొస్తే.. సమంత నిర్మించిన ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.