ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'రాజాసాబ్'పై రిలీజ్ టైంలోనే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ రావడంతో ఫ్లాప్ అయింది. ప్రభాస్ ఉన్నప్పటికీ మూవీ లవర్స్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. సరేలే అయిపోయిందేదో అయిపోయిందనుకుంటే ఓటీటీలోకి మూవీ వచ్చిన తర్వాత విమర్శలు, ట్రోలింగ్ మరింత ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రభాస్కి చాలాచోట్ల డూప్ ఉపయోగించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు హీరోయిన్ డూప్ విషయంలో కొత్తగా ట్రోల్స్ చేస్తున్నారు.
'రాజాసాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. వీళ్లలో ఒక్కరి పాత్ర కూడా సరిగా డిజైన్ చేయలేదు. నిధి, రిద్ధి కంటే మాళవికకు కాస్త స్కోప్ దొరికింది. ఓ చోట ఫైట్ సీన్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈమెకి కూడా డూప్ వాడిన విషయం బయటపడింది. ఇదే చిత్రంలో విలన్ గ్యాంగ్లో నటించిన రోన్సన్ విన్సెంట్ అనే నటుడు.. తాజాగా 'రాజాసాబ్' గురించి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇందులో మాళవికకి కూడా డూప్ ఉందనే సంగతి బయటపెట్టాడు. దీంతో కొత్తగా పలువురు నెటిజన్లు.. 'రాజాసాబ్'పై ట్రోల్స్ చేస్తున్నారు.
చాలా సినిమాల్లో స్టార్ హీరోహీరోయిన్లకు డూప్స్ని ఉపయోగిస్తారు. కానీ సదరు డూప్ యాక్టర్స్ గురించి ఒక్క ఫొటో గానీ వీడియో గానీ బయటపడకుండా మూవీ టీమ్ జాగ్రత్త పడుతుంది. 'రాజాసాబ్' విషయంలో ఇదంతా రివర్స్లో జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మూవీ రిలీజ్కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో దర్శకుడు మారుతినే ప్రభాస్కి డూప్ ఉపయోగించామని ఒప్పుకొన్నాడు. ఇప్పుడేమో ఓ యాక్టర్.. హీరోయిన్ డూప్గా చేసిన వ్యక్తితో కలిసి ఫొటోలు పోస్ట్ చేయడం చర్చనీయాంశమైపోయింది.


