మలయాళ స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ సొంత భాషలోనే సెటిలైపోకుండా బాలీవుడ్లోనూ అనేక సినిమాలు చేశాడు. హీరా ఫెరి, హంగామా, భూల్ భులయ్యా వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇష్టం లేదు
అయితే తనకు కామెడీ చిత్రాలకంటే సీరియస్ సినిమాలు చేయడమే ఇష్టం అంటున్నాడు తాజాగా పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ మాట్లాడుతూ.. సీరియస్ చిత్రాలు తెరకెక్కించడమంటే నాకు చాలా ఇష్టం. కామెడీ మూవీస్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నాకు వేరే ఆప్షన్ లేక కామెడీ జానర్లో సినిమాలు చేయాల్సి వస్తోంది.
ఎందుకు చూడరు?
సీరియస్ సినిమాలు చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం చూపిస్తారు అదే కామెడీ జానర్లో ఉంటే మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఒక మంచి దర్శకుడిగా పరిగణించరు. ఈ విషయంలో నాకు చాలా బాధేస్తుంది. కామెడీ సినిమాలు తీసేవాళ్లను మంచి దర్శకులుగా ఎందుకు చూడరు? మనదగ్గరే కాదు, ప్రపంచమంతటా అలాగే ఉంది. హాస్యభరిత చిత్రాలు చేసేవారిని జోకర్లా చూస్తున్నారు. కామెడీ సినిమాలకు ఆస్కార్ రావడం కూడా చాలా అరుదు. ఇది నిజంగా బాధాకరం.. కానీ ఇదే జరుగుతోంది అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు.


