ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. తెలుగు ప్రేక్షకుల కోసమా అన్నట్లు డబ్బింగ్ల రూపంలోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. రీసెంట్ టైంలో అలా 'సూపర్ సుబ్బు' సిరీస్ మన ఆడియెన్స్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తోంది. దీనితో పాటు హాట్స్టార్లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన 'ప్రీతమ్ అండ్ పెడ్రో' అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ కూడా మెప్పిస్తోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?)
కథేంటి?
ప్రీతమ్(వీర్ హిరానీ) గోవాలో తాతతో కలిసి జీవిస్తుంటాడు. వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్మ్యాన్గా పనిచేస్తుంటాడు. తన తాతకు ఎంతో ఇష్టమైన టేప్ రికార్డర్ ఎవరో దొంగిలించారని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఓ రోజు ప్రీతమ్ కంప్లైంట్ చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో అదే స్టేషన్కి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారి పెడ్రో(అర్షద్ వార్సి)కి ఓ ఏటీఎం దొంగతనం విషయంలో ఇతడు సాయం చేస్తాడు. మరోవైపు కేంద్ర మంత్రి కొడుకు కిడ్నాప్ కేసు పెడ్రో దగ్గరకు వస్తుంది. దీని విషయంలో తనకు కాస్త సాయం చేయాలని, అప్పుడే టేప్ రికార్డర్ వెతికి పెడతానని ప్రీతమ్కి పెడ్రో కండీషన్ పెడతాడు. ఇంతకీ మంత్రి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? ప్రీతమ్ గతేమేంటి? గతంలో పెడ్రో కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు? ఈ కథలో హ్యాకర్ మార్టిన్(విక్రాంత్ మస్సే) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
సినిమా అయినా సిరీస్ అయినా చూస్తున్నంతసేపు ఎంటర్టైన్ లేదా థ్రిల్ చేసిందా? అనేది కీలకం. అలాంటి వాటికే ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. 'ప్రీతమ్ అండ్ పెడ్రో' అలా పూర్తిస్థాయిలో ఆకట్టుకుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దీనికి స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. సిరీస్ చూస్తున్నప్పుడు ఈయన గతంలో తీసిన మూవీస్ స్టైల్ అడుగడుగునా కనిపిస్తుంది. క్రైమ్ అనే పాయింట్కి క్రేజీ కామెడీ మిక్స్ చేయడం సరిగ్గా కుదిరింది.
ఓ ఏటీఎం దొంగతనంతో మొదలైన ఈ సిరీస్లో తొలి రెండు ఎపిసోడ్ల కాస్త నిదానంగా సాగినట్లు అనిపిస్తాయి కానీ మిగిలిన నాలుగు ఎపిసోడ్లు మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఓ కిడ్నాప్ కేసు కారణంగా ఇద్దరు హ్యాకర్లు ఒకరితో ఒకరు తలపడి, ఎత్తుకు పైఎత్తులు వేయడం కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత ఫోన్ ఉపయోగించాలంటేనే కచ్చితంగా భయమేస్తుంది. ఎందుకంటే మన ఫోన్ని కూడా ఎవరైనా హ్యాక్ చేసి మనకు సంబంధించనవన్నీ గమనిస్తున్నారా అనే సందేహం కలుగుతుంది.
ఇదే సిరీస్లో ఇప్పటితరం పిల్లలు ఎంత దారుణంగా తయారయ్యారు? బ్లూ వేల్ అనే గేమ్ కారణంగా ఎలా ప్రాణాలు తీసుకుంటున్నారు? ఈ విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అనే అంశాల్ని ఏదో మెసేజ్ ఇచ్చినట్లు కాకుండా బాగా చూపించారు. అలానే ప్రీతమ్, మార్టిన్ మధ్య సాగే హ్యాకింగ్ సీన్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. మనం కూడా హ్యాకింగ్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనిపించేలా ఈ సిరీస్ చేస్తుంది.

నటీనటుల విషయానికొస్తే ప్రీతమ్గా చేసిన వీర్ హిరానీకి నటుడిగా ఇదే అరంగేట్రం. అక్కడక్కడ అనుభవ లేమి కనిపిస్తుంది గానీ ఓవరాల్గా బాగా నటించాడు. పెడ్రో అనే పోలీస్ అధికారిగా అర్షద్ వార్సి మెప్పించాడు. హ్యాకర్ మార్టిన్గా విక్రాంత్ మస్సే సీన్స్ తక్కువే గానీ ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు కూడా తమ వరకు న్యాయం చేశారు. ఇక చివరలో రెండో సీజన్ కూడా ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఇప్పుడొచ్చిన దానిలో కిడ్నాప్ కామెడీ చూపించారు. రెండో సీజన్లో రూ.100 కోట్ల బ్యాంక్ దొంగతనం కేసుని పరిష్కరించేది చూపించబోతున్నారు.
చివరి ఎపిసోడ్లో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ దత్ అతిథి పాత్రలు తెగ నవ్విస్తాయి. ఆరు ఎపిసోడ్లు, క్రేజీ ట్విస్టులతో దాదాపు మూడున్నర గంటల నిడివి ఉన్న ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. ఈ వీకెండ్ ఏదైనా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చూద్దామనుకుంటే ఇది మంచి ఆప్షన్.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ)


