70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ | OTT Movie Reviews: Pranayam 1947 Movie Review Telugu, Check Storyline, Positive And Negatives In This Film | Sakshi
Sakshi News home page

Pranayam 1947 OTT Review: మనసుకు హత్తుకునే ప్రేమకథ.. చూస్తే మర్చిపోలేరు

Apr 26 2025 2:44 PM | Updated on Apr 26 2025 3:36 PM

Pranayam 1947 Movie Review Telugu

కొత్త సినిమాలు ఎన్నో వస్తుంటాయి. కొన్ని మాత్రం మన మనసుకు నచ్చేస్తాయి. అరె ఇది మన కథలా ఉందే అనే భావన కలిగిస్తాయి. చూస్తున్నంతసేపు మనసుకు హత్తుకుంటూనే గుండెను బరువెక్కిస్తాయి. అలాంటి సినిమానే 'ప్రణయం 1947'. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఈ తెలుగు డబ్బింగ్ మూవీ ఎలా ఉంది? రివ్యూ ఏంటనేది చూద్దాం.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు

కథేంటి?
శివన్న (జయరాజన్) 70 ఏళ్ల వృద్ధుడు. భార్య చనిపోవడం, కొడుకులు పెళ్లి చేసుకుని మరోచోటుకి వెళ్లిపోవడంతో సొంతూరిలో పొలం మధ్యలో కట్టుకున్న ఇంటిలో ఒంటరిగా జీవిస్తుంటాడు. దగ్గరలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తుంటాడు. అదే ఆశ్రమంలో గౌరీ (లీలా) అనే ముసలావిడ కూడా ఉంటుంది. గతంలో టీచర్ గా పనిచేసిన ఈమె సొంతింటిపై బెంగతో ఇక్కడ ఉండలేకపోతుంటుంది. ఓ సందర్భంలో శివ చెప్పిన జోక్ ని సీరియస్ గా తీసుకున్న గౌరీ.. అతడితో పాటు అతడి ఇంట్లోనే కలిసి ఉంటానని అంటుంది. కట్ చేస్తే పిల్లల అనుమతితో శివ-గౌరీ కలిసి జీవిస్తారు. తర్వాత ఏమైందనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఇప్పటివరకు టీనేజీ, మధ్య వయసు ప్రేమకథలు మనం చూశాం. కానీ ఇది ఓల్డేజీ ప్రేమకథ. అంటే భార్య చనిపోయిన ఓ వ్యక్తి, భర్త చనిపోయిన ఓ మహిళ.. ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేదే 'ప్రణయం 1947'.

కుటుంబం, పిల్లలు, బాధ్యతలు అంటూ చాలామంది తల్లిదండ్రులు జీవితం మొత‍్తం కష్టపడుతూనే ఉంటారు. కానీ ముసలితనంలో మాత్రం వీళ్లని కొడుకులు దూరం పెడుతున్నారు. దీంతో చాలామంది ఒంటరితనాన్ని భరిస్తూ బతుకుతున్నారు. వృద్ధాప్యంలో తమకు ప్రేమని పంచే ఓ తోడు ఉంటే బాగుండు అనుకునే ఎందరో తల్లిదండ్రుల మనోవేదనే ఈ సినిమా.

(ఇదీ చదవండి: ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' రివ్యూ

చూస్తున్నంతసేపు చాలా హృద్యంగా ఉంటుంది. సినిమాలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు ఉండవు. కొందరు సాధారణ మనషులు, వారి మధ్య జరిగే సంభాషణలు, సున్నితమైన హాస్యం, ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమ, చిరుకోపం.. ఇలా ప్రతి సీన్ మనసుకు హత్తుకునేలా ఉంటుంది.

ప్రేమకు వయసుతో సంబంధం లేదని విషయాన్ని తెరపై చూపించిన విధానం చాలా బాగుంది. పిల్లలు తమను కాదనుకోవడంతో అటు ఆశ్రమాల్లో ఉండలేక.. ఇటు ఇంటికి వెళ్లలేక లోలోపల మధనపడే పెద్దల బాధని కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్లేటులో ఇడ్లీ పెట్టి ప్రేమని వ్యక్తపరచడం, మనషుల కంటే కుక్కలే విశ్వాసంగా ఉంటాయని చెప్పే సన్నివేశాలు భలే ఉన్నాయని చెప్పొచ్చు.

కేవలం 100 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా చూస్తున్నంతసేపు సరదాగానే ఉంటుంది. కానీ చివరకొచ్చేసరికి ట్రాజెడీ ఉంటుంది. లీనమైతే మన కంట్లో నీళ్లొచ్చేస్తాయి. 50,60 ఏళ్ల వయసు గల వ్యక్తులు ఈ మూవీ చూస్తే ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే తెరపై కనిపించేది సినిమా కాదు. అలాంటి వాళ్ల జీవితం కాబట్టి.

ఎవరెలా చేశారు?
శివ, గౌరీ టీచర్ గా ప్రధాన పాత్రలు చేసిన జయరాజన్, లీలా సామ్సన్ జీవించేశారు. చాలా సహజ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. కొన్నిచోట్ల ల్యాగ్ అనిపించినప్పటికీ మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ విషయంలో దర్శకుడు అభిజిత్ అశోకన్ ని మెచ్చుకోవాలి.

ఈ వీకెండ్ ఏదైనా ఓ మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'ప్రణయం 1947' చూడొచ్చు. ఆహా ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది. కుటుంబంతో కలిసి చూడొచ్చు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement