కమల్‌కు జోడీ?

Nayanthara roped in for Kamal Haasan film KH 234 with Mani Ratnam - Sakshi

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌కి జోడీగా దక్షిణాది స్టార్‌ హీరోయిన్స్‌లో ఒకరైన నయనతార నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్‌ 2’ సినిమాతో బిజీగా ఉన్న కమల్‌హాసన్‌ ఆ తర్వాతి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో చేయనున్నారు. మణిరత్నం–కమల్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘నాయగన్‌’ 1987 అక్టోబర్‌ 21న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది.

దాదాపు 36 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోంది. ఈ చిత్రానికి ‘కేహెచ్‌ 234’ అనే వర్కింగ్‌ టైటిల్‌ నిర్ణయించారు. ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత త్రిష పేరు వినిపించింది. ‘మన్మధన్‌ అంబు’, ‘తూంగావనం’ చిత్రాల తర్వాత కమల్‌–త్రిష ముచ్చటగా మూడోసారి ‘కేహెచ్‌ 234’ కోసం పని చేయనున్నారంటూ తమిళ చిత్ర సీమలో  వార్తలొచ్చాయి. తాజాగా నయనతార పేరు తెరపైకి వచ్చింది. కథానాయిక పాత్ర కోసం ఆమెతో చర్చలు జరుపుతున్నారట మేకర్స్‌.

చర్చలు సఫలమైతే కమల్‌తో నయనతార నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. మరి ‘కేహెచ్‌ 234’లో కమల్‌తో నటించే అవకాశం త్రిష, నయనతారలో ఎవర్ని వరిస్తుంది? వీరిద్దరూ కాకుండా వేరే కొత్త హీరోయిన్‌ తెరపైకి వస్తారా? అనే వివరాలు తెలియాలంటే వేచి చూడాలి. కాగా మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నెల 28న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. మరోవైపు కమల్‌హాసన్‌ కూడా ‘ఇండియన్‌ 2’ తో బిజీగా ఉన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా షెడ్యూల్‌ను పూర్తి చేసి, ఇండియాకి తిరిగొచ్చింది యూనిట్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top