
‘‘మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ’ వంటి సినిమాల్లో హీరో ఎవరని చెప్పలేం. అందులో కథే హీరో... అవన్నీ కూడా డైరెక్టర్ ఫిలిమ్స్. ‘కుబేర’ కూడా ఔట్ అండ్ ఔట్ శేఖర్ కమ్ములగారి మూవీ ఈ సినిమా కోసం తను ప్రాణం పోశారు. మా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని అక్కినేని నాగార్జున చెప్పారు.
అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా, జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (ఈ నెల 20న) తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.
(చదవండి: నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు.. కర్ణుడిలా ఆయన వెంట ఉంటా : మంచు విష్ణు)
శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘శేఖర్ చెప్పిన ‘కుబేర’ కథ వినగానే నాది మెయిన్ క్యారెక్టర్ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతి పాత్ర నేను చేసిన దీపక్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. నా పాత్రకి వచ్చిన స్పందన గొప్ప ఆనందాన్నిచ్చింది. నా అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు’’ అని చెప్పారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘ఇది సామాన్యమైన సినిమా కాదు. సరస్వతీ దేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను.. అది ఈ రోజు నిజమైంది’’ అన్నారు. ‘‘కుబేర’ పెద్ద హిట్ అవుతుందని కథ విన్నప్పుడే చెప్పాను’’ అని సునీల్ నారంగ్ పేర్కొన్నారు. ‘‘మా సినిమాకి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది. నిర్మాతలుగా చాలా సంతోషంగా ఉన్నాం’’ అని పుస్కూర్ రామ్మోహన్ రావు చెప్పారు.