‘‘సింగీతం శ్రీనివాసరావుగారు ఎప్పుడూ అంతర్జాతీయ స్థాయిలోనే ఆలోచిస్తారు. ‘సింగ్ గీతం’లాంటి సినిమా ప్రపంచంలో ఎక్కడా రాలేదని ఆయన చెప్పేవారు. ఈ సినిమా పూర్తయ్యాక చూస్తుంటే నిజంగానే ఈ తరహా సినిమా ఇప్పటివరకు రాలేదనిపిస్తోంది. భవిష్యత్లో కూడా ఇలాంటి సినిమా రావడం కష్టమే. మన తరానికి సింగీతంగారు ఈ సినిమా ఇస్తున్నారంటే మనం అదృష్టవంతులమనే చెప్పాలి. పదేళ్ల తర్వాత గుర్తుండిపోయే సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ ‘సింగ్ గీతం’ చిత్రం చేశాం’’ అని దర్శక–నిర్మాత నాగ్ అశ్విన్ చెప్పారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి నటించిన సినిమా ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చెప్పిన విశేషాలు...
→ ‘పుష్పక విమానం’ సినిమాకు ముందే సింగీతంగారు ‘సింగ్ గీతం’ కథను కమల్హాసన్గారికి చెప్పారు. అయితే సింగీతంగారికి ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ కారణంగా ఈ చిత్రాన్ని అప్పట్లో చేయడం ఆయనకు సాధ్యపడలేదు. ఇప్పుడు కుదిరింది. సింగీతంగారి సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ‘పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం’ ఇలా ఆయన డైరెక్షన్లో వచ్చిన ఏ సినిమాను తీసుకున్నా టైమ్లెస్గా ఉంటాయి. ‘పుష్పక విమానం’ ఇప్పటికి సంబంధించిన సినిమాలానే ఉంటుంది. ‘సింగ్ గీతం’ కూడా ఈ జనరేషన్ కోసం తీసిన కథలానే అనిపిస్తుంది.
→ ‘మహానటి’ సినిమా తర్వాత సింగీతంగారు నాకు ‘సింగ్ గీతం’ సినిమా కథ చెప్పారు. ఇది కల్పిత కథ. కుబేరపురంలో గోల్డ్ మైన్స్ ఉంటాయి. ఆ ఊరికి, ఆ గోల్డ్ మైన్స్కు ఉన్న సంబంధం ఏంటి? అనేది సింగీతంగారి శైలిలో హ్యూమర్, హ్యుమానిటీల మేళవింపుతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ఒక ప్రత్యేక ప్రపంచంలో జరుగుతున్నట్లుగా సాగుతుంది. కాబట్టి పెద్ద స్టార్స్ అయితే వారి ఇమేజ్ ప్రభావం ఈ కథపై పడే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులు కొత్తగా, సహజంగా ఫీలవ్వాలనే ఉద్దేశంతో సింగీతంగారు కొత్తవారిని తీసుకున్నారు.
→ ఈ సినిమా కోసం సింగీతంగారితో రెండేళ్లు ప్రయాణించాను. ఒకసారి ఆయన ఏదైనా చెప్పి, ఆ తర్వాత అది ఆయనకే నచ్చకపోతే మార్చేస్తారు. ‘మీరే చెప్పారు కదా?’ అంటే... ‘నేను తప్పు చేయకూడదా?’ అంటారు. నేను కొత్తతరం దర్శకుడినా? కాదా అనే సందేహం నాకు అప్పుడప్పుడు వస్తుంటుంది (సరదాగా). కానీ సింగీతంగారు 94 ఏళ్ల వయసులో కూడా ఓ టీనేజర్ తీసినట్లే ఈ సినిమా తీశారు. ఈ ప్రాజెక్ట్ ప్రతి అడగులో నేను ఉన్నాను. సింగీతంగారి విజన్ను స్క్రీన్పై తీసుకురావడానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ఉన్నానని అనుకోవచ్చు.
→ మ్యూజిక్ పరంగా ఇది చాలెంజింగ్ సినిమా. ఇందులో డైలాగ్స్ అన్నీ పాటల్లా వస్తాయి. కానీ మ్యూజిక్ వింటున్నాం అనే ఫీలింగ్ రాదు. దేవిశ్రీ ప్రసాద్గారు మంచి సంగీతం ఇచ్చారు.
→ ఏ సినిమా సక్సెస్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ కథను నిజాయితీగా చెప్పడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ‘పుష్పక విమానం’ కథను సింగీతంగారు చెప్పినప్పుడు కూడా ‘మాటలు లేకుండా సినిమా ఏంటి?’ అని చాలామంది అనుకుని ఉంటారు. నేను ‘మహానటి’ తీస్తానంటే ‘ఇప్పుడు ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు?’ అనే మాటలు వినిపించాయి. సినిమా పూర్తయ్యేవరకు ఎవరూ అంచనా వేయలేరు. నిజాయితీని నమ్మితే విజయం దానంతట అదే వస్తుంది.
→ నా డైరెక్షన్లోని ‘కల్కి 2’ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి కంటిన్యూస్గా షూటింగ్ జరపడానికి ప్లాన్ చేశాం. రిలీజ్ ఎప్పుడనే విషయంపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను.


