మేం దూరం పాటించడంలేదు

Most Eligible Bachelor resumed shooting  - Sakshi

మళ్లీ లొకేషన్‌లోకి అడుగుపెట్టారు అఖిల్‌. బ్రేక్‌ తర్వాత చిత్రీకరణలో పాల్గొనడం భలే ఉంది అన్నారాయన. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయింది. రెండు రోజుల క్రితం పూజా హెగ్డే షూటింగ్‌లో పాల్గొన్నారు.

తాజాగా అఖిల్‌ కూడా జాయినయ్యారు. లొకేషన్‌లో పూజాతో దిగిన ఫోటోను షేర్‌ చేశారు. ‘అన్ని జాగ్రత్తలతోనే సినిమా షూట్‌ చేస్తున్నాం. మేమిద్దరమే (కెమెరా ముందు) మాస్క్‌ వేసుకోలేదు. మేము కూడా మాస్క్‌ వేసుకుంటే సినిమాలో మీరు మమ్మల్ని గుర్తుపట్టరు’’ అని సరదాగా అన్నారు అఖిల్‌. ‘సెట్లో భౌతిక దూరం పాటించనది మేమిద్దరమే. ఎందుకంటే ఒక రొమాంటిక్‌ కామెడీ సన్నివేశాన్ని తీస్తున్నాం కాబట్టి’’ అన్నారు పూజా హెగ్డే. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top