దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్గా దూసుకెళుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. సుందర్ .సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెజీనా, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇషారి కె. గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ‘మహాశక్తి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నామని యూనిట్ పేర్కొంది.
నయనతార లీడ్ రోల్లో ఆర్జె బాలాజీ, ఎన్జె శరవణన్ దర్శకత్వం వహించిన ‘మూకుత్తి అమ్మన్’ 2020 నవంబరు 14న విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్గా ‘మూకుత్తి అమ్మన్ 2’ రూపొందుతోంది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార నటన, కథాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని మేకర్స్ పేర్కొన్నారు.
గతంలో ‘మూకుత్తి అమ్మన్’ చిత్రం దీపావళి పండగ సందర్భంగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ పొందింది. అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ ‘మహాశక్తి’ని కూడా నవంబర్లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. పండగ సమయంలో దైవిక కథాంశంతో కూడిన చిత్రాలకు కుటుంబ ప్రేక్షకాదరణ బాగుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది.


