‘శపథం’తో మళ్లీ వచ్చేస్తున్న లక్ష్మీ మీనన్‌! | Lakshmi Menon Joins The Sets Of Aadhi Pinisetty Sabdham | Sakshi
Sakshi News home page

‘శపథం’తో మళ్లీ వచ్చేస్తున్న లక్ష్మీ మీనన్‌!

Feb 26 2023 9:01 AM | Updated on Feb 26 2023 9:01 AM

Lakshmi Menon Joins The Sets Of Aadhi Pinisetty Sabdham - Sakshi

తమిళ సినిమా: కుంకీ చిత్రంతో కోలీవుడ్‌ను తన వైపు తిప్పుకున్న నటి లక్ష్మీ మీనన్‌. ఆ తరువాత విశాల్, విజయ్‌ సేతుపతి, విమల్‌ వంటి కథానాయకులతో జతకట్టి సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మలయాళం కుట్టి కెరీర్‌ మంచి పీక్‌లో ఉండగానే ప్లస్‌–2  చదువును పూర్తి చేయాలంటూ నటనకు గ్యాప్‌ ఇచ్చింది. అదే ఈ అమ్మడు చేసిన పెద్ద పొరపాటు అని అ తరువాత తెలిసొచ్చినట్లుంది. కళ్లు తెరిచే సరికి అంతా తారుమారు అయ్యింది. అవకాశాలు పూర్తిగా దూరమయ్యాయి.

విజయ్‌ సేతుపతితో రెక్క అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చినా, అది నిరాశ పరచడంతో లక్ష్మీ మీనన్‌ పూర్తిగా తెరమరుగై పోయింది. అలా 2016 తరువాత లక్ష్మీ మీనన్‌ను కోలీవుడ్‌ పట్టించుకోలేదు. ఆ తరువాత ఒకటి రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు నామమాత్రమే. అలాంటిది తాజాగా కొత్త చిత్రంతో తమిళంలో రీఎంట్రీ అవుతోంది. దర్శకుడు అరివళగన్‌ తాజాగా నటుడు ఆది పినిశెట్టి కథానాయకుడిగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఈరమ్‌ అనే సక్సెస్‌ ఫుల్‌ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.

కాగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన అరివళగన్‌ తన తాజా చిత్రాన్ని భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్నారు. దీనికి శపథం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా అరివళగన్‌ నిర్మాతగా మారడం విశేషం. దీన్ని ఆయన 7జీ ఫిలిమ్స్‌ శివతో కలిసి నిర్మిస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రంలో కథానాయకిగా నటి లక్ష్మీ మీనన్‌ను ఎంపిక చేశారు. దీనికి సంబంధించి నటి లక్ష్మీ మీనన్‌ ఫొటోతో పోస్టర్‌ను యూనిట్‌ వర్గాలు విడుదల చేశాయి. చిత్ర షూటింగ్‌ ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌ విడుదల ఎప్పుడు అన్నది త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement