ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం నచ్చడంతో ఈ అవకాశం.. ఇది నా అదృష్టం | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం నచ్చడంతో ఈ అవకాశం.. ఇది నా అదృష్టం

Published Sat, Feb 18 2023 2:09 AM

Kiran Abbavaram Geetha Arts - Sakshi

‘‘గీతా ఆర్ట్స్‌లాంటి మంచి, పెద్ద బ్యానర్‌లో నటించా లని అందరూ అనుకుంటారు. నా కెరీర్‌ప్రారంభంలోనే ఆ బ్యానర్‌లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి మంచి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని హీరో కిరణ్‌ అబ్బవరం అన్నారు.

మురళి కిషోర్‌ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్‌ అబ్బవరం, కాశ్మీర  జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’ సినిమా నచ్చడంతో అల్లు అరవింద్, వాసుగార్లు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చేసే అవకాశం ఇచ్చారు. ప్రేమ, వినోదం, థ్రిల్‌.. ఇలా కుటుంబ సమేతంగా చూడదగ్గ అన్ని అంశాలతో మురళి తెరకెక్కించారు.

నా కెరీర్‌లో ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’ మంచి కమర్షియల్‌ హిట్‌. ఆ సినిమాని మించిన కమర్షియల్‌ హిట్‌ని ‘వినరో..’ సాధిస్తుంది. ‘కిరణ్‌ ఎలాంటి పాత్రలైనా చేయగలడు’ అని ప్రేక్షకులతో అనిపించుకోవా లన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మీటర్‌’ షూటింగ్‌ పూర్తయింది. ‘రూల్స్‌ రంజన్‌’ 80 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు.

Advertisement
Advertisement