
హీరో మహేశ్బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ను సెప్టెంబరులో నైరోబీ, టాంజానియా, సౌత్ ఆఫ్రికా లొకేషన్స్లో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. కాగా ఈ సినిమా అప్డేట్ను నవంబరులో వెల్లడిస్తామని మహేశ్బాబు బర్త్ డే సందర్భంగా ఈ ఆగస్టు 9న రాజమౌళి పేర్కొన్నారు. ఈ సినిమాకు ‘జెన్ 63’ అనే టైటిల్ను అనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది.
ఇక ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్రదర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియా వచ్చినప్పుడు ఈ ‘జెన్ 63’ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ కంటెంట్ను ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేస్తే గ్లోబల్ రేంజ్లో రీచ్ ఉంటుందని రాజమౌళి భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
ఇదిలా ఉంటే... 2023లో జరిగిన ఓ అంతర్జాతీయ అవార్డుల వేడుకలో భాగంగా రాజమౌళి, జేమ్స్ కామెరూన్ కలుసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కామెరూన్ ప్రశంసించారు. ఇదిలా ఉంటే... జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లోని ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం ఈ డిసెంబరు 19న తెలుగులోనూ రిలీజ్ కానుంది.